గతేడాది(2025) డిసెంబర్.. ఈ ఏడాది(2026) ఏప్రిల్ మధ్య దరఖాస్తు చేసిన 9 కంపెనీల ప్రాస్పెక్టస్లను సెబీ తాజాగా అనుమతించింది. జాబితాలో రీడిఫ్.కామ్ ఇండియాసహా ప్లేసింపుల్ గేమ్స్, గరుడా ఏరోస్పేస్ తదితరాలున్నాయి. ఇప్పటికే వారాంతాన(7న) రెండు కంపెనీల(లీప్ ఇండియా, టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్) పబ్లిక్ ఇష్యూలు ప్రారంభంకాగా.. స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ ఎన్క్యూబ్ ఎథికల్స్ రూ. 3,000 కోట్ల సమీకరణకు వీలుగా సెబీకి దరఖాస్తు చేసింది. తాజాగా లిస్టింగ్కు అనుమతి పొందిన జాబితాలో జాక్సన్ గ్రీన్, అడ్రాయిట్ ఇండస్ట్రీస్, ఎక్స్ప్రెషన్ 360 సర్వీసెస్ ఇండియా, ఎస్ఎన్వీఏ ట్రావెల్టెక్, నైనీ పేపర్స్తోపాటు.. రైల్వే రంగ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈపీసీ సర్వీసుల కంపెనీ లక్స్యో సైతం చేరింది.
గోప్యతా విధానంలో
జాక్సన్ గ్రీన్ లిమిటెడ్, రీడిఫ్.కామ్ ఇండియా, ఎస్ఎన్వీఏ ట్రావెల్టెక్, గరుడా ఏరోస్పేస్ గోప్యతా మార్గంలో సెబీకి దరఖాస్తు చేయడం ద్వారా అనుమతి పొందాయి. కాగా.. పూర్తి క్యాజువల్ మొబైల్ గేమ్స్ కంపెనీ ప్లేసింపుల్ గేమ్స్ ఐపీవో ద్వారా రూ. 3,150 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. కంపెనీలో 97 శాతం వాటా కలిగిన ప్రమోటర్ సంస్థ ఎంటీజీక్స్ గేమింగ్ హోల్డింగ్ ఏబీ ఈక్విటీ షేర్లను ఆఫర్ చేయనుంది. 2024–25లో కంపెనీ రూ. 2,260 కోట్ల ఆదాయం సాధించింది.
ఇక గరుడా ఏరోస్పేస్ ఐపీవో ద్వారా రూ. 1,000 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 250 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. డ్రోన్ల తయారీ ఈ చెన్నై స్టార్టప్ వ్యవసాయం, రక్షణ రంగాలతోపాటు ఎంటర్ప్రైజ్ సరీ్వలెన్స్ సంబంధ యూఏవీలను రూపొందిస్తోంది.
ఇన్ఫీబీమ్ నుంచి..
ఎవెన్యూస్ఏఐ లిమిటెడ్(గతంలో ఇన్ఫీబీమ్ ఎవెన్యూస్) అనుబంధ కంపెనీ రీడిఫ్.కామ్ ఇండియా సీసీఎవెన్యూ పేరుతో డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ను నిర్వహిస్తోంది. అంతేకాకుండా ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ బిల్డ్ఏబజార్ను సైతం ఏర్పాటు చేసింది. ఇంజినీరింగ్, తయారీ రంగ కంపెనీ అడ్రాయిట్ ఇండస్ట్రీస్ ఐపీవోలో భాగంగా 98.97 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 13.5 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను మెషీనరీ, పరికరాలు, రవాణా మౌలిక సదుపాయాలు తదితరాల కొనుగోలు(పెట్టుబడి వ్యయాలు)కు వెచ్చించనుంది. అనుబంధ సంస్థ అడ్రాయిట్ డ్రైవ్షాఫ్టŠస్లో పెట్టుబడి, రుణ చెల్లింపులకు సైతం నిధులు వినియోగించనుంది. ప్రధానంగా ఆటోమోటివ్, ఇండ్రస్టియల్ రంగ పరికరాలు తయారు చేస్తోంది.
టెక్నాలజీ, పేపర్..
కోల్కతా మీడియా, ప్రకటనల కంపెనీ ఎక్స్ప్రెషన్ 360 సర్వీసెస్ ఇండియా పబ్లిక్ ఇష్యూలో భాగంగా 1.5 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్ ఆఫర్ చేయనున్నారు. దీంతో ఇష్యూ నిధులు కంపెనీకికాకుండా ప్రమోటర్కు చేరనున్నాయి. మధ్యప్రదేశ్లోని ఇండోర్ కంపెనీ లక్స్యో ఐపీవోకింద రూ. 150 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. టెక్నాలజీ ఆధారిత ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫామ్ ట్రావోమింట్ను నిర్వహిస్తున్న ఎస్ఎన్వీఏ ట్రావెల్టెక్ పబ్లిక్ ఇష్యూకి రానుంది.
కంపెనీ ప్రధానంగా వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్ల ద్వారా విమానాలు, హోటళ్లు, అద్దె కార్లు, ప్రయాణ బీమా తదితర ట్రావెల్ బుకింగ్ సర్వీసులు సమకూర్చుతోంది. స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్కు సమీకృత పేపర్ తయారీ కంపెనీ నైనీ పేపర్స్కు సెబీ నుంచి గ్రీన్సిగ్నల్ లభించింది. కంపెనీ రైటింగ్, ప్రింటింగ్, ఇండ్రస్టియల్, ప్యాకేజింగ్ సంబంధ పేపర్ను తయారు చేస్తోంది. ఉత్తరాఖండ్లోని కాశిపూర్లో తయారీ ప్లాంటును కలిగి ఉంది. సెబీ నుంచి తాజాగా అనుమతి పొందిన కంపెనీలన్నీ బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్కానున్నాయి.


