కోట్ల రూపాయల విలువైన ఒక ఇండియన్ సూపర్ లీగ్ (ISL) ఫుట్బాల్ క్లబ్ను కేవలం 100 రూపాయలకే అమ్మేశారంటే.. ఎవరైనా నమ్మగలరా?, కానీ టాటా స్టీల్, జంషెడ్పూర్ ఎఫ్సీ ఫుట్బాల్ అండ్ స్పోర్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (జెఎఫ్ఎస్పీఎల్) విషయంలో ఇదే జరిగింది. గోవాకు చెందిన.. చర్చిల్ బ్రదర్స్ స్పోర్ట్స్ క్లబ్కు వంద రూపాయలకే విక్రయించింది. ఇది ప్రస్తుతం క్రీడా, వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంత తక్కువ ధరలు టాటా లాంటి దిగ్గజ కంపెనీ ఎందుకు అమ్మేసింది?, దీని వెనుక ఉన్న కారణం ఏమిటనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
జంషెడ్పూర్లో ఎన్నో ఏళ్లుగా ఫుట్బాల్ను ప్రోత్సహించిన టాటా స్టీల్, ISLలో జంషెడ్పూర్ ఎఫ్సీని బలమైన జట్టుగా తీర్చిదిద్దిన తర్వాత ఇప్పుడు యాజమాన్య బాధ్యతల నుంచి తప్పుకుంటోంది. ఈ ఒప్పందంతో క్లబ్కు సంబంధించిన ఐఎస్ఎల్ స్పోర్టింగ్ లైసెన్స్తో పాటు ఇతర హక్కులు, బాధ్యతలు కూడా చర్చిల్ బ్రదర్స్కు బదిలీ కానున్నాయి. అయితే.. దీనికి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (AIFF)తో పాటు మరికొన్ని అవసరమైన అనుమతులు రావాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఆగస్టు 31లోపు పూర్తయ్యే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 2026 నుంచి చర్చిల్ బ్రదర్స్ కొత్త బాధ్యతలు చేపట్టనుంది. జట్టులోని 12 మంది ఆటగాళ్లు, ఇద్దరు కోచ్ల కాంట్రాక్టులను కూడా కొత్త యాజమాన్యం కొనసాగించనుంది. అంటే.. జంషెడ్పూర్ ఎఫ్సీ క్లోజ్ అవ్వడం లేదు.. కేవలం దాని యజమాని మాత్రమే మారుతున్నాడు.
ఐఎస్ఎల్ క్లబ్ను రూ.100కే ఎందుకు ఇచ్చారు?
దీనికి సమాధానం క్లబ్ వెనుక ఉన్న కంపెనీ ఆర్థిక పరిస్థితి అనే తెలుస్తోంది. జెఎఫ్ఎస్పీఎల్ 2026 ఆర్థిక సంవత్సరంలో రూ. 32.23 కోట్ల టర్నోవర్ సాధించింది. మార్చి 2026 నాటికి దాని నికర విలువ మైనస్ రూ.5.8 కోట్లుగా ఉంది. దీన్నిబట్టి చూస్తే.. సంస్థ ఆర్థికస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే.. రూ.100కు విక్రయించడం అనేది అసలు ధర కాదు. ఇది టోకెన్ మొత్తం మాత్రమే.
నిజానికి టాటా ఫుట్బాల్ అకాడమీ 1987లో జంషెడ్పూర్లో ప్రారంభమైంది. దశాబ్దాలుగా ఈ అకాడమీ ద్వారా ఎంతోమంది యువ ఆటగాళ్లు శిక్షణ పొందారు. వారిలో చాలామంది భారత జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించారు.
ఇదీ చదవండి: కియోసాకి ప్రశ్న.. ఘాటుగా స్పందించిన నెటిజన్లు!


