న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ మెరుగైన ఫలితాలతో ఆకట్టుకుంది. అమ్మకాల జోరు, ప్రపంచవ్యాప్తంగా మెటల్స్ ధరలు ఎగబాకుతుండటం, రూపాయి మారకం విలువ క్షీణత దన్నుతో కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2026–27, క్యూ1)లో రూ. 5,473 కోట్ల కన్నాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది.
గతేడాది ఇదే కాలంలో రూ. 3,185 కోట్లతో పోలిస్తే లాభం 72 శాతం దూసుకెళ్లింది. అలాగే ఆదాయం సైతం 53.6 శాతం ఎగసి రూ. 15,754 కోట్ల నుంచి రూ. 24,205 కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరాన్ని పటిష్టమైన ఫలితాలతో ప్రారంభించామని, వేదాంతా నుంచి విభజించిన (డీమెర్జర్) వ్యాపార విభాగాలన్నీ బలమైన పనితీరును కనబరుస్తున్నట్లు కంపెనీ ఈడీ అరుణ్ మిశ్రా చెప్పారు.
టాటా స్టీల్ లాభం 19 శాతం అప్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టాటా స్టీల్ నికర లాభం 19 శాతం ఎగిసి రూ. 2,385 కోట్లకు చేరింది. గత క్యూ1లో ఇది రూ. 2,007 కోట్లుగా నమోదైంది. సమీక్షాకాలంలో మొత్తం ఆదాయం రూ. 53,467 కోట్ల నుంచి రూ. 61,027 కోట్లకు చేరింది. ఎన్ఐఎన్ఎల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని వార్షికంగా 4.8 మిలియన్ టన్నుల మేర పెంచుకునే ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఇందుకోసం సుమారు రూ. 33,873 కోట్లు వెచ్చించనుంది.
దీనితో తమ బ్రాండెడ్ ఉత్పత్తులకు అత్యధిక డిమాండ్ ఉన్న రిటైల్ విభాగంలో లాంగ్ ప్రోడక్ట్స్ పోర్ట్ఫోలియోను విస్తరించేందుకు కంపెనీకి వీలవుతుంది. ప్రస్తుతం టాటా స్టీల్లో ఎన్ఐఎన్ఎల్ విలీన ప్రక్రియ జరుగుతోంది. 2022 జూలై 4న ఒరిస్సాలోని నీలాచల్ ఇస్పాత్ నిగమ్ను (ఎన్ఐఎన్ఎల్) తమ అనుబంధ సంస్థ టాటా స్టీల్ లాంగ్ ప్రోడక్ట్స్ (టీఎస్ఎల్పీ) ద్వారా రూ. 12,100 కోట్లకు టాటా స్టీల్ కొనుగోలు చేసింది.


