న్యూఢిల్లీ: ఐటీ సేవల రంగానికి చెందిన కంపెనీ కోఫోర్జ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) తొలి త్రైమాసికానికి గానూ రూ.518 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో కంపెనీ రూ.317 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 63 శాతం అధికంగా ఉంది. ఆదాయం 49 శాతం వృద్ధి చెంది రూ.3,704 కోట్ల నుంచి రూ.5,528 కోట్లకు చేరింది.
ఇటీవల పూర్తి చేసిన ఎన్కోరా సంస్థ కొనుగోలుతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఆధారిత సేవలకు డిమాండ్ భారీగా పెరగడమే ఈ రికార్డు స్థాయి ఫలితాలకు ప్రధాన కారణమని కంపెనీ వెల్లడించింది. క్యూ1లో నికరంగా 10,451 మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకోవడంతో, జూన్ చివరికి ఉద్యోగుల సంఖ్య 46,228 కి చేరినట్లు కంపెనీ తెలిపింది. ముఖ్యంగా 2–3 ఏళ్ల అనుభవం ఉన్న ‘ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఇంజనీర్ల’ నియామకాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు కంపెనీ వెల్లడించింది.


