ఒకప్పుడు భారత్లో వ్యాపారం అంటే అనుమతులు, పన్నులు, ప్రభుత్వ నియంత్రణల మధ్య సాగేది. స్వాతంత్య్రం తర్వాత దేశ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం పరిశ్రమలపై మరింత నియంత్రణ సాధించింది. 1991 ఆర్థిక సంస్కరణలతో పరిస్థితి పూర్తిగా మారింది. నేడు డిజిటల్ సింగిల్ విండో, డీరెగ్యులేషన్, లేబర్ కోడ్లతో వ్యాపారం ప్రారంభించే విధానం మరో దశలోకి వెళ్లింది.
స్వాతంత్యానికి ముందు.. వ్యాపారం అంటే?
1947కు ముందు ‘బిజినెస్ ప్రారంభించడానికి ఒకే చట్టం’ అంటూ ఏదీ లేదు. కంపెనీలు, కర్మాగారాలు, గనులు, ఉప్పు, మద్యం, బ్యాంకింగ్, దిగుమతులు-ఎగుమతులకు వేర్వేరు చట్టాలు, నిబంధనలు ఉండేవి. బ్రిటిష్ ఇండియా, సంస్థాన ప్రాంతాల్లోనూ విధానాలు భిన్నంగా ఉండేవి.
కంపెనీల ఏర్పాటుకు 19వ శతాబ్దంలోనే చట్టపరమైన వ్యవస్థ మొదలై, చివరకు కంపెనీల చట్టం, 1913 అమల్లోకి వచ్చింది. కంపెనీల ఏర్పాటు, నిర్వహణ, మూసివేతకు ఇది ప్రాతిపదికగా నిలిచింది. అయితే నేటి ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’తో దీన్ని పోల్చలేం. వలస పాలనలో ఆర్థిక విధానాలు ప్రధానంగా బ్రిటిష్ పాలన అవసరాలకు అనుగుణంగా ఉండేవి.
ఉప్పుపై ప్రభుత్వ నియంత్రణ ఇందుకు ఉదాహరణ. 1882 ఉప్పు చట్టం ద్వారా ఉప్పు తయారీ, సేకరణ, నిర్వహణపై నియంత్రణ ఉండేది. ప్రజలు స్వయంగా ఉప్పు తయారు చేయడం, విక్రయించడం స్వేచ్ఛగా చేయలేకపోయారు. ఈ పరిస్థితి మహాత్మాగాంధీ నేతృత్వంలోని ఉప్పు సత్యాగ్రహానికి కీలక నేపథ్యంగా మారింది.
కర్మాగారం పెట్టాలంటే కార్మిక చట్టాలు
పరిశ్రమలపై నియంత్రణతో పాటు కార్మిక చట్టాలు కూడా వచ్చాయి. 1881లో తొలి ఫ్యాక్టరీ చట్టం అమల్లోకి వచ్చింది. పిల్లల పనివేళలు, కొన్ని భద్రతా అంశాలపై పరిమితులు విధించింది. 1891, 1911, 1922, 1934లో చట్టాలు మరింత విస్తరించాయి. పని గంటలు, కార్మిక సంక్షేమం, భద్రత వంటి అంశాలు కూడా నియంత్రణలోకి వచ్చాయి.
1947 తర్వాత.. ప్రభుత్వ ఆధిపత్యం
స్వాతంత్య్రం తర్వాత భారత్ స్వయం సమృద్ధి కలిగిన పారిశ్రామిక దేశంగా ఎదగడంపై దృష్టి పెట్టింది. 1948 పారిశ్రామిక విధానంతో పరిశ్రమల్లో ప్రభుత్వ పాత్రకు రూపం వచ్చింది. కొన్ని కీలక రంగాలను ప్రభుత్వ ఆధీనంలో ఉంచి, మరికొన్నింటిలో ప్రైవేటు రంగానికి అవకాశం ఇచ్చారు. 1951లో వచ్చిన పరిశ్రమల (Development and Regulation) చట్టం ద్వారా కొన్ని పరిశ్రమల స్థాపన, విస్తరణపై కేంద్రానికి లైసెన్సింగ్ అధికారం లభించింది.
1956 పారిశ్రామిక విధానంతో ప్రభుత్వ పాత్ర మరింత పెరిగింది. పరిశ్రమలను ప్రభుత్వ రంగానికి కేటాయించినవి, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి అనువైనవి, ప్రైవేటు రంగానికి చెందినవిగా విభజించారు. దీంతో పరిశ్రమ ప్రారంభించడం, ఉత్పత్తి సామర్థ్యం పెంచడం, విస్తరించడం వంటి వాటికి ప్రభుత్వ అనుమతులు కీలకమయ్యాయి. ఇదే ‘లైసెన్స్ రాజ్’కు బలం చేకూర్చింది.
1991.. అతిపెద్ద మలుపు
1991 ఆర్థిక సంక్షోభం తర్వాత భారత్ పారిశ్రామిక విధానాన్ని పూర్తిగా మార్చుకుంది. జూలై 24, 1991న ప్రకటించిన కొత్త పారిశ్రామిక విధానంలో చాలా పరిశ్రమలకు లైసెన్సింగ్ను రద్దు చేశారు. వ్యూహాత్మక, భద్రత, పర్యావరణ, ప్రమాదకర ఉత్పత్తులకు సంబంధించిన కొన్ని రంగాలను మాత్రం మినహాయించారు.
సామర్థ్య నియంత్రణలు కూడా గణనీయంగా తొలగడంతో కంపెనీలకు ఉత్పత్తి, విస్తరణ నిర్ణయాల్లో స్వేచ్ఛ పెరిగింది. ప్రైవేటు రంగానికి మరిన్ని అవకాశాలు, విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరుచుకున్నాయి. అంటే 1950–80లలో ‘ముందు ప్రభుత్వ అనుమతి.. తర్వాత పెట్టుబడి’ విధానం ఉంటే, 1991 తర్వాత మార్కెట్ ఆధారిత నిర్ణయాలకు ప్రాధాన్యం పెరిగింది.
కంపెనీల చట్టంలోనూ మార్పులు
1913 కంపెనీల చట్టం స్థానంలో స్వాతంత్య్రం తర్వాత కంపెనీల చట్టం, 1956 వచ్చింది. ఆ తర్వాత పారదర్శకత, పెట్టుబడిదారుల రక్షణ, కార్పొరేట్ పాలనకు ప్రాధాన్యం పెరగడంతో కంపెనీల చట్టం, 2013 అమల్లోకి వచ్చింది.
ఇప్పుడు.. డిజిటల్గా వ్యాపారం
2026 నాటికి వ్యాపారం ప్రారంభించే విధానం మరింత డిజిటల్గా మారింది. నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (NSWS) ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవసరమైన అనుమతులను గుర్తించి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం NSWS 32 కేంద్ర విభాగాల మార్గదర్శకత్వాన్ని, 34 రాష్ట్ర ప్రభుత్వాల అనుమతుల కోసం అప్లికేషన్ సదుపాయాలను అందిస్తోంది. కొత్త ఇండస్ట్రియల్ లైసెన్స్, ఇండస్ట్రియల్ ఎంట్రాప్రెన్యూర్ మెమొరాండం (IEM) దరఖాస్తుల ప్రక్రియ కూడా ఇందులోకి మారింది.
2025లో మరో కీలక సంస్కరణ
2025 నవంబర్ 21 నుంచి నాలుగు లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చాయి. వీటి ద్వారా 29 కేంద్ర కార్మిక చట్టాలను నాలుగు సమగ్ర కోడ్లుగా ఏకీకృతం చేశారు. వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, ఉద్యోగుల భద్రత-ఆరోగ్యానికి సంబంధించిన నిబంధనలను ఒకే విస్తృత చట్టపరమైన ఫ్రేమ్వర్క్లోకి తీసుకురావడం వీటి లక్ష్యం.
మొత్తంగా చూస్తే.. బ్రిటిష్ కాలంలో పరిమితులు, పన్నులు, ఏకాధికారాల నుంచి స్వాతంత్య్రం తర్వాత ప్రభుత్వ ఆధిపత్యం, ఆపై 1991లో మార్కెట్ సంస్కరణలు.. ఇప్పుడు డిజిటల్ అనుమతులు, సరళీకృత నిబంధనల వరకు భారత్లో వ్యాపార వ్యవస్థ ఎన్నో దశలను దాటింది.


