ఎల్ నినో ప్రభావంపై ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. రుతుపవనాలు మరోసారి బలాన్ని పుంజుకుంటున్నాయి. ఆకాశం నుంచి తీసిన ఉపగ్రహ చిత్రాల్లో దేశంలోని చాలా ప్రాంతాలు దట్టమైన మేఘాలతో కప్పుకున్నట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన కొత్త అల్పపీడనం తూర్పు, మధ్య భారతంలో వర్షాలకు ఊతమిస్తోంది.
ప్రస్తుతం వాతావరణ నిపుణుల దృష్టి మొత్తం బంగాళాఖాతం వైపే ఉంది. అక్కడ ఏర్పడే అల్పపీడనాలు రుతుపవనాలకు కీలకమైన ఇంధనంలా పనిచేస్తాయి. సముద్రం నుంచి తేమను తీసుకువచ్చి భూభాగంపైకి వర్షాలను తీసుకువస్తాయి. తాజాగా ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
శాటిలైట్ చిత్రాల్లో..
భారత ఉపగ్రహాలు, అంతర్జాతీయ వాతావరణ ఉపగ్రహాలు పంపిన చిత్రాల్లో అరేబియా సముద్రం నుంచి మధ్య భారతం మీదుగా గంగా మైదానాలు, ఈశాన్య రాష్ట్రాల వరకు మేఘాల విస్తరణ కనిపిస్తోంది. ముఖ్యంగా బంగాళాఖాతం పరిసరాల్లో దట్టమైన మేఘాలు ఉండటం బలమైన వర్ష వ్యవస్థకు సంకేతంగా భావిస్తున్నారు. తూర్పు భారతంపై కనిపిస్తున్న చల్లటి మేఘ శిఖరాలు బలమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు సూచనగా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల స్థానికంగా వరద పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
ఎల్ నినోతో ఎందుకు టెన్షన్?
సాధారణంగా ఎల్ నినో ఏర్పడిన సంవత్సరాల్లో భారత రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం కనిపించే అవకాశం ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వాతావరణ గాలుల మార్పులు చోటుచేసుకుని వర్షపాతంపై ప్రభావం చూపుతాయి. అయితే ఎల్ నినో వచ్చిన ప్రతిసారీ కచ్చితంగా కరవే వస్తుందని చెప్పలేం. ఇతర వాతావరణ పరిస్థితులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం ఎల్ నినో పరిస్థితులు బలపడే అవకాశం ఉందని అంచనాలు ఉన్నప్పటికీ.. బంగాళాఖాతం నుంచి వరుసగా ఏర్పడుతున్న వర్ష వ్యవస్థలు రుతుపవనాలకు కొంత ఊరటనిస్తున్నాయి.
కీలకమైన ఆగస్టు వర్షాలు
భారత వ్యవసాయానికి రుతుపవనాలు ఎంతో కీలకం. దేశంలోని కోట్లాది మంది రైతులు వర్షాధార పంటలపై ఆధారపడుతుంటారు. జూన్, జూలైలో వర్షాల తీరును బట్టి పంటల సాగు ప్రభావితమవుతుంది. ముఖ్యంగా ఆగస్టు నెలలో వచ్చే వర్షాలు పంటల ఎదుగుదలకు చాలా అవసరం. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షపాతం లోటు కనిపించగా.. మరికొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు నమోదవుతున్నాయి. ఈ అసమాన పరిస్థితులను సమతుల్యం చేయడంలో బంగాళాఖాతం నుంచి వచ్చే అల్పపీడనాలు కీలకంగా మారుతున్నాయి.
రుతుపవనాలకు కొత్త ఊపు
ప్రస్తుతం కనిపిస్తున్న వాతావరణ పరిస్థితులు రుతుపవనాలు పూర్తిగా బలహీనపడలేదని సూచిస్తున్నాయి. ఎల్ నినో ముప్పు ఉన్నప్పటికీ.. బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమ, వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలు వర్షాలకు బలాన్ని ఇస్తున్నాయి.
ఆగస్టు రెండో భాగంలో తూర్పు, మధ్య, ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు మరింత చురుగ్గా కొనసాగే అవకాశం ఉంది. అయితే ఎల్ నినో ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నది రాబోయే వారాల్లోని వాతావరణ మార్పులపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మాత్రం ఆకాశంలో కనిపిస్తున్న మేఘాలు.. రుతుపవనాలకు మరోసారి ఆశలు రేకెత్తిస్తున్నాయి.


