
ఇరాన్- ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం అంటూ ముందే క్రెడిట్ తీసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పెద్ద షాకే తగిలింది. ట్రంప్ ప్రకటించిన కాసేపటికే అంతా ఉత్తదేనంటూ ఇరాన్ ప్రకటించింది. ఈ క్రమంలో ఒప్పందం కోసం ట్రంప్ తమను వేడుకున్నారంటూ సంచలన ప్రకటన చేసింది. అదే సమయంలో ఇజ్రాయెల్పై మరోసారి క్షిపణులతో దాడులకు తెగబడింది.
పశ్చిమాసియాలో యుద్ధం 12వ రోజుకి చేరగా.. ఇజ్రాయెల్పై ఇరాన్ తాజాగా మిస్సైల్స్ ప్రయోగించింది. ఏకంగా 10 మిస్సైల్స్ ప్రయోగించిందని.. ఐదుగురు మరణించారని తెలుస్తోంది. అయితే ఇరాన్ తమపై ఆరు క్షిపణులతో దాడులకు దిగినట్లు ధృవీకరించిన ఇజ్రాయెల్.. ఈ దాడుల్లో ముగ్గురు మృతి చెందినట్లు ప్రకటించుకుంది. మరోవైపు.. ఇజ్రాయెల్లో పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ట్రంప్ ప్రకటన ఆయన సొంత అడ్మినిస్ట్రేషన్లోని ఉన్నతాధికారులను ఆశ్చర్యపరిచినట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. అదే సమయంలో ట్రంప్ ప్రకటనపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మండిపడిన సంగతి తెలిసిందే. కాసేపటికే శాంతి ఒప్పందం కోసం ట్రంప్ వేడుకొన్నారంటూ మరో సంచలన ప్రకటన చేసింది.
‘‘ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందం కోసం ట్రంప్ మా దేశాన్ని వేడుకున్నారు. ఖతార్లో అమెరికా వాయు స్థావరాలపై తాము దాడులు చేసిన వెంటనే కాళ్ల బేరానికి వచ్చారు’’ అంటూ ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానల్ కథన ప్రసారం చేసింది. అంతకు ముందు.. కాల్పుల విరమణపై ఎలాంటి ఒప్పందం కుదరలేదన్న ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి, ఇజ్రాయెల్ దాడులను ఆపితే.. తాము ఆపుతామని స్పష్టం చేసింది.
ఇరాన్ ప్రకటనతో సంబంధం లేకుండా ట్రంప్ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇరుదేశాలు ఒకేసారి కాళ్లబేరానికి వచ్చాయంటూ ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందం సాధించామని, అందుకు గర్వకారణంగా ఉందంటూ తన సోషల్ ట్రూత్ అకౌంట్లో వరుస పోస్టులు పెడుతున్నారు.