ఇరాన్‌ ఎఫెక్ట్‌.. భారత్‌కు గ్యాస్‌ సిలిండర్‌ టెన్షన్‌! | Iran block Strait of Hormuz Effect On Indian LPG | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ ఎఫెక్ట్‌.. భారత్‌కు గ్యాస్‌ సిలిండర్‌ టెన్షన్‌!

Jun 23 2025 12:52 PM | Updated on Jun 23 2025 2:47 PM

Iran block Strait of Hormuz Effect On Indian LPG

ఢిల్లీ: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా మన వంటింట్లో గ్యాస్‌ బాంబ్‌ పేలి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో హర్మూజ్‌ జల సంధి మూత పడితే భారత్‌కు ఎల్‌పీజీ స్ట్రోక్‌ తగిలే ప్రమాదం ఉంది. వంట ‍గ్యాస్‌ సరఫరాకు ఆటంకం కలిగే అవకాశముంది. దేశీయ అవసరాలకు మన వద్ద 15-16 రోజుల వరకే రిజర్వ్‌లు ఉన్నట్టు సమాచారం. దీంతో, గ్యాస్‌ టెన్షన్‌ మొదలైంది.

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడుల కారణంగా ప్రపంచ దేశాలపై మరో భారం పడనుంది. వంట గ్యాస్‌ సిలిండర్‌ మరింత భారం కానుంది. హర్మూజ్‌ జల సంధి మూత పడితే భారత్‌కు ఎల్‌పీజీ కష్టాలు రానున్నాయి. ప్రస్తుతానికి ఎల్‌పీజీ అవసరాల్లో భారత్‌కు అధిక శాతం పశ్చిమాసియా నుంచే దిగుమతి జరుగుతోంది. దేశంలో 60 శాతం గ్యాస్‌ దిగుమతుల ద్వారానే వస్తోంది. సౌదీ, యూఏఈ, ఖతార్‌ నుంచి భారత్‌కు 95 శాతం ఎల్‌పీజీ దిగుమతులు జరుగుతున్నాయి.

మూడింట రెండు అటు నుంచే..
దేశంలో వాడే ప్రతీ మూడు వంట గ్యాస్‌ సిలిండర్లలో రెండు పశ్చిమాసియా నుంచి దిగుమతి చేసుకున్నవే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లిక్విడ్‌ పెట్రోలియం గ్యాస్‌కు ప్రత్యామ్నాయాలు వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశీయ అవసరాలకు మన వద్ద 15-16 రోజుల వరకే రిజర్వ్‌లు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో హర్మూజ్‌ జలసంధి మూతపడితే గ్యాస్ సరఫరాకు తీవ్ర ఆటంకం కలగనుంది. ఇదే సమయంలో మరో విధంగా గ్యాస్‌ సరఫరా చేసుకుంటే ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

ఎరువులపై ప్రభావం.. 
మరోవైపు.. హర్మూజ్‌ జలసంధి ప్రభావం ఇటు వ్యవసాయ రంగంపై కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎరువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇరాన్‌లో అధిక మొత్తంలో అమ్మోనియా దొరుకుతుంది. పలు దేశాలకు ఇరాన్‌ నుంచే అమ్మెనియా ఎగుమతులు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇరాన్‌ నుంచి అమ్మెనియా ఆగిపోతే మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చమురు నిల్వలు ఓకే.. 
ఇదిలా ఉండగా.. అమెరికా దాడికి నిరసనగా హర్మూజ్‌ జలసంధిని మూసివేసేందుకు ఇరాన్‌ పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. అయితే, తుది నిర్ణయానికి అత్యున్నత భద్రతా సంస్థ ఆమోదం అవసరం. పర్షియన్ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో కలిపే ఈ ఇరుకైన మార్గం ద్వారా ప్రపంచంలో పెద్ద చమురు వ్యాపారం జరుగుతుంది. అలాంటి దీన్ని మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగనున్నాయి. అయితే, భారత్‌లో కొన్ని వారాల పాటు ఇంధన అవసరాలు తీర్చేందుకు తగినంత చమురు అందుబాటులో ఉన్నది. భారత్‌ అనేక మార్గాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుందని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు.

రష్యా నుంచి..
భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు కాగా.. గ్యాస్‌ దిగుమతిలో నాలుగో స్థానంలో ఉన్నది. ప్రభుత్వం రెండు వారాలుగా పశ్చిమాసియా పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని.. ప్రధాని మోదీ నాయకత్వంలో గత కొన్ని సంవత్సరాలుగా సరఫరాను వైవిధ్యంలో తీసుకువచ్చామని కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ పేర్కొన్నారు. ఇప్పుడు హర్మూజ్‌ జలసంధి నుంచి ఎక్కువగా తీసుకురావడం లేదని పేర్కొన్నారు. భారత్‌ మొత్తం రోజుకు 55లక్షల బ్యారెల్స్‌ చమురు దిగుమతి (BPD)లో దాదాపు 20 లక్షల బ్యారెల్స్‌ మాత్రమే ఈ జలసంధి ద్వారా వస్తున్నది.

అయితే, గతకొన్ని సంవత్సరాలుగా రష్యా, అమెరికా, బ్రెజిల్‌ తదితర దేశాల నుంచి చమురు సరఫరాను పెంచింది. రష్యా నుంచి వచ్చే చమురు హర్మూజ్‌ మార్గం ద్వారా రాదు. ఇది సూయజ్‌ కాలువ.. కేప్ ఆఫ్ గుడ్ హోప్.. పసిఫిక్ మహాసముద్రం ద్వారా వస్తుంది. యూఎస్‌, పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా నుంచి సరఫరా ఖరీదైనప్పటికీ ఆచరణీయమైన ఎంపికగా మారాయని.. ఇంధన సరఫరా స్థిరత్వాన్ని నిర్ధారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement