కొత్త గ్యాస్‌ కనెక్షన్లు ఇంకెప్పుడు ఇస్తారు? | New LPG Connections Halted in India What Consumers Need to Know | Sakshi
Sakshi News home page

కొత్త గ్యాస్‌ కనెక్షన్లు ఇంకెప్పుడు ఇస్తారు?

Aug 17 2026 1:35 PM | Updated on Aug 17 2026 1:56 PM

New LPG Connections Halted in India What Consumers Need to Know

ఇంట్లో పొయ్యి వెలిగించేందుకు కొత్త ఎల్‌పీజీ కనెక్షన్‌ కోసం ఎదురుచూస్తున్న వారికి నిరీక్షణ తప్పడం లేదు. కొత్తగా ఇల్లు తీసుకున్న వారు, అద్దెకు మారిన కుటుంబాలు, కొత్తగా పెళ్లైన జంటలు గ్యాస్‌ కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటున్నా.. అనేక ప్రాంతాల్లో అవి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. అలా రోజూ వేలల్లో.. ఇప్పటికే లక్షల్లో పేరుకుపోయాయి. ఇవికాకుండా మరికొన్ని దరఖాస్తులు కూడా సిద్ధంగా ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలపై నెలకొన్న ఒత్తిడి, ముఖ్యంగా పశ్చిమాసియా పరిణామాల ప్రభావంతో ఎల్‌పీజీ లభ్యతపై అప్రమత్తమైన చమురు సంస్థలు ప్రస్తుతం ఉన్న వినియోగదారుల అవసరాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో కొత్త డొమెస్టిక్‌ ఎల్‌పీజీ కనెక్షన్లు, అదనపు సిలిండర్ల కేటాయింపులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. కమర్షియల్‌ సిలిండర్ల సరఫరా మాత్రం కొనసాగుతోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాపార సంస్థల కార్యకలాపాలు నిలిచిపోకుండా ఉండేందుకు వాణిజ్య అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.

యుద్ధ ప్రభావం.. సరఫరాపై అప్రమత్తత
భారత్‌ ఎల్‌పీజీ అవసరాల్లో గణనీయమైన భాగం దిగుమతుల ద్వారానే తీరుతుంది. అంతర్జాతీయ పరిణామాల కారణంగా సరఫరా మార్గాల్లో ఇబ్బందులు తలెత్తితే దేశీయంగా కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇటీవల ఎల్‌పీజీ సరఫరాలో ఒత్తిడి ఎదురైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలకు దిగింది. దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచేందుకు రిఫైనరీలు, చమురు సంస్థలకు ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించింది.

దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ రిఫైనరీలు, అప్‌స్ట్రీమ్‌ సంస్థలు కలిసి రోజుకు గరిష్ఠంగా 63,810 టన్నుల ఎల్‌పీజీ ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని సిద్ధంగా ఉంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ జామ్‌నగర్‌ రిఫైనరీకి అత్యధిక ఉత్పత్తి లక్ష్యం కేటాయించినట్లు సమాచారం.

ప్రస్తుతం దేశంలో రోజువారీ ఎల్‌పీజీ వినియోగం సుమారు 90 వేల టన్నులకు పైగా ఉంది. ఇందులో దిగుమతుల వాటా ఎక్కువగా ఉండటంతో.. భవిష్యత్‌లో సరఫరా అంతరాయాలు రాకుండా కేంద్రం నిల్వలు, ఉత్పత్తిపై దృష్టి పెట్టింది.

మరి కొత్త కనెక్షన్లు ఆపడం ఎందుకు?
ఇండియన్‌, భారత్‌ గ్యాస్‌, హెచ్‌పీ గ్యాస్‌ వంటి సంస్థల డీలర్ల ప్రకారం.. ప్రస్తుతం ఉన్న వినియోగదారులకు సిలిండర్ల సరఫరా సాఫీగా కొనసాగించడం ప్రధాన ప్రాధాన్యతగా మారింది. అందుకే కొత్త డొమెస్టిక్‌ కనెక్షన్లు, డబుల్‌ బాటిల్‌ కనెక్షన్లను తాత్కాలికంగా పరిమితం చేస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు ఒక కుటుంబానికి ఒకే గ్యాస్‌ కనెక్షన్‌ విధానం అమలుపైనా చమురు సంస్థలు దృష్టి పెడుతున్నాయి. ఒకే చిరునామాలో ఉన్న బహుళ కనెక్షన్లను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.

దరఖాస్తులు వెల్లువలా వస్తే పరిస్థితి ఏంటి?
కొత్త కనెక్షన్ల కోసం ప్రస్తుతం డిమాండ్‌ భారీగా పెరిగే అవకాశం ఉందని ఏజెన్సీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త ఇళ్లు, అపార్ట్‌మెంట్లు పెరుగుతుండటం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎల్‌పీజీ వినియోగం పెరగడంతో దరఖాస్తులు పెండింగ్‌లో పేరుకుపోయే పరిస్థితి కనిపిస్తోంది. ‘‘సరఫరా పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన వెంటనే పెండింగ్‌ దరఖాస్తులను దశలవారీగా పరిష్కరించే అవకాశం ఉంది’’ అని గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు.

ఇలా ఇంకెన్నాళ్లు ?
కొత్త కనెక్షన్లు పునఃప్రారంభించే తేదీని చమురు సంస్థలు అధికారికంగా ప్రకటించలేదు. అయితే అంతర్జాతీయ సరఫరా పరిస్థితులు మెరుగుపడి, దేశీయ నిల్వలు స్థిరపడితే కొన్ని వారాల నుంచి ఒకటి రెండు నెలల వ్యవధిలో కొత్త కనెక్షన్ల జారీ ప్రక్రియ మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది అన్ని ప్రాంతాలకు ఒకేసారి కాకుండా.. సరఫరా పరిస్థితులు, స్థానిక డిమాండ్‌ ఆధారంగా దశలవారీగా ఉండొచ్చని చెబుతున్నారు.

వినియోగదారులకు సూచనలు
కొత్త కనెక్షన్‌ కోసం ఎదురుచూస్తున్న వారు తమ సమీప గ్యాస్‌ ఏజెన్సీలో దరఖాస్తు వివరాలు నిరంతరం తెలుసుకుంటూ ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆధార్‌, చిరునామా ధ్రువీకరణ వంటి పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం మంచిదని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement