‘యుద్ధంతో జీవించలేం’.. ఇరాన్‌లో వినిపిస్తున్న కొత్త స్వరం | Irans New Voice Against War: Calls for Diplomacy Amid Rising Tensions | Sakshi
Sakshi News home page

‘యుద్ధంతో జీవించలేం’.. ఇరాన్‌లో వినిపిస్తున్న కొత్త స్వరం

Aug 17 2026 1:59 PM | Updated on Aug 17 2026 2:32 PM

Irans New Voice Against War: Calls for Diplomacy Amid Rising Tensions

అమెరికా–ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ ఇరాన్‌లో అంతర్గత చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. యుద్ధ మార్గమా? లేక దౌత్య మార్గమా? అనే ప్రశ్నపై దేశ రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ ఖటామీ చేసిన వ్యాఖ్యలు టెహ్రాన్‌లో కొత్త చర్చకు దారితీశాయి.

‘‘యుద్ధంతో ఎప్పటికీ జీవించలేం.. సమస్యలను పరిష్కరించేందుకు దౌత్య మార్గాలను అన్వేషించాలి’’ అని ఖటామీ చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుత ఇరాన్‌ విధానంపై పరోక్ష విమర్శలుగా భావిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌ నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లను ఎదుర్కొంటూనే.. దేశ అంతర్గత సమస్యలు, ప్రజల జీవన పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

సంస్కరణవాద నేత ఖటామీ స్వరం
మహ్మద్‌ ఖటామీ 1997 నుంచి 2005 వరకు ఇరాన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన సంస్కరణవాద భావజాలానికి దగ్గరగా ఉన్న నేతగా గుర్తింపు పొందారు. పాశ్చాత్య దేశాలతో సంబంధాల మెరుగుదల, రాజకీయ సంస్కరణలు, పరిమిత దౌత్య విధానాలకు ఆయన మద్దతు ఇచ్చేవారు. ప్రస్తుతం అధికారంలో లేకపోయినా.. ఇరాన్‌లో ఆయనకు ఉన్న రాజకీయ ప్రభావం కారణంగా తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా యుద్ధ వాతావరణంలో ఉన్న దేశంలో శాంతి, చర్చల ప్రస్తావన చేయడం రాజకీయంగా కీలక సంకేతంగా మారింది.

‘‘ప్రజలు యుద్ధంలో జీవించలేరు’’
యుద్ధం ద్వారా శాశ్వత పరిష్కారం సాధ్యం కాదని ఖటామీ స్పష్టం చేశారు. విదేశీ శక్తుల నుంచి వచ్చే బెదిరింపులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. దేశ ప్రజల ఆర్థిక పరిస్థితులు, సాధారణ జీవనం కూడా ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఉండాలని సూచించారు. అమెరికా ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిళ్లు ఇప్పటికే ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాలిక ఘర్షణలు కొనసాగితే ప్రజలపై మరింత భారం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

మరోవైపు కఠిన వైఖరిలో అధికార వర్గం
అయితే ఇరాన్‌ అధికార వ్యవస్థలోని కీలక వర్గాలు మాత్రం అమెరికా, ఇజ్రాయెల్‌ విషయంలో కఠిన వైఖరినే కొనసాగిస్తున్నాయి. సుప్రీం లీడర్‌ వర్గం విదేశీ ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది. ఇరాన్‌లో అత్యంత ప్రభావశీలమైన శక్తిగా ఉన్న ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (IRGC) కూడా ప్రతిఘటన విధానానికే మద్దతు ఇస్తోంది. భద్రత, విదేశాంగ విధానం, ప్రాంతీయ వ్యూహాల్లో కీలక పాత్ర పోషించే ఐఆర్‌జీసీ.. అమెరికా, ఇజ్రాయెల్‌పై వ్యతిరేకతను దేశ రక్షణలో భాగంగా చూస్తోంది.

అధ్యక్షుడి పాత్ర పరిమితం
ప్రస్తుత ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ గతంలో దౌత్య సంబంధాల పునరుద్ధరణకు అనుకూలంగా మాట్లాడిన నేతగా గుర్తింపు పొందారు. అయితే ఇరాన్‌ రాజకీయ వ్యవస్థలో తుది నిర్ణయాధికారం సుప్రీం లీడర్‌, భద్రతా వ్యవస్థ చేతుల్లో ఉంటుంది. అందువల్ల అధ్యక్షుడి వైఖరి కంటే.. సుప్రీం లీడర్‌ వర్గం, సైనిక వ్యవస్థ నిర్ణయాలే కీలకంగా మారుతాయి.

ఆర్థిక సమస్యలు.. ప్రజల్లో అసంతృప్తి
ఇరాన్‌లో యుద్ధ వాతావరణం, ఆంక్షలు, ఆర్థిక ఇబ్బందులు ప్రజల్లో అసంతృప్తిని పెంచుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా యువతలో ఉద్యోగాలు, జీవన ప్రమాణాలు, అంతర్జాతీయ అవకాశాలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. యుద్ధం మరింత కొనసాగితే ఈ సమస్యలు తీవ్రం కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో దేశంలో కొంత వర్గం దౌత్యానికి అవకాశం ఇవ్వాలని కోరుతోంది.

ముందున్న మార్గం ఏంటి?
ఖటామీ వ్యాఖ్యలు వెంటనే ఇరాన్‌ విదేశాంగ విధానాన్ని మార్చే అవకాశం లేకపోయినా.. దేశంలో ఉన్న అంతర్గత భిన్నాభిప్రాయాలను మాత్రం బయటపెట్టాయి. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా కఠినంగా ముందుకు వెళ్లాలనే వర్గం.. మరోవైపు దేశ ప్రయోజనాల కోసం చర్చలకు అవకాశం ఇవ్వాలనే వర్గం మధ్య ఇరాన్‌లో చర్చ కొనసాగుతోంది. యుద్ధం మరింత తీవ్రం అవుతుందా? లేదంటే దౌత్యానికి కొత్త మార్గం తెరుచుకుంటుందా? అనేది రాబోయే పరిణామాలపై ఆధారపడి ఉంది. ఖటామీ వ్యాఖ్యలు మాత్రం ఇరాన్‌ అంతర్గత రాజకీయాల్లో కొత్త ప్రశ్నలకు తెరలేపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement