
తీవ్రత తక్కువే అయినా కూడా శక్తివంతమైన భూకంపం శుక్రవారం ఇరాన్ను వణికించింది. ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లేదని.. స్వల్ప ఆస్తి నష్టం మాత్రమే సంభించిందని ఇరాన్ న్యూస్ ఏజెన్సీ ఐఆర్ఎన్ఏ ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్తో ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఇరాన్ అణు పరీక్షలు నిర్వహించడంతోనే అక్కడ భూమి కంపించిందా? అనే అనుమానాలు తెరపైకి వచ్చాయి.
జూన్ 20 శుక్రవారం ఇరాన్ సెమ్నాన్ ప్రాంతంలో 5.2 తీవ్రతతో భూమి కంపించింది. సెమ్నాన్కు 27 కిలోమీటర్ల దూరంలో.. 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం నమోదైంది. అయితే టెహ్రాన్ అణు పరీక్షలు నిర్వహించడం వల్లే భూమి కంపించిందనే అనుమానాలు మొదలయ్యాయి. అందుకు కారణం లేకపోలేదు.
ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య భీకర యుద్ధం 9వ రోజుకి చేరింది. అణు ఒప్పందాలపై ఎలాంటి చర్చలు ఉండబోవని ఇరాన్ తాజాగా ప్రకటించింది కూడా. అయితే ఆ దేశ సైన్యం నడిపించే మిస్సైల్ కాంప్లెక్స్తో పాటు సీక్రెట్ స్పేస్ సెంటర్ కూడా సెమ్నాన్ ప్రాంతంలోనే ఉంది. అందుకే ఈ అనుమానం తెర మీదకు వచ్చింది.
సాధారణంగా అణు పరీక్షలు నిర్వహించే క్రమంలో భూమి కంపించడం సహజమే. పేలుళ్ల ధాటికి టెక్టానిక్ ప్లేట్లు ఒత్తిడికి గురికావడం వల్ల భూకంపానికి దారితీసే అవకాశం ఉంది. అయితే భూకంప శాస్త్రవేత్తలు (Seismologists).. సహజ భూకంపాలకు, అణు కార్యక్రమాల వల్ల ఏర్పడే ప్రకంపనలకు తేడాను గుర్తించగలుగుతారు.
ఇండియా టుడే కథనం ప్రకారం.. ఇరాన్ తాజా భూకంపానికి, అణు పరీక్షలకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని యూఎస్ జియోలాజికల్ సర్వేతో పాటు కాంప్రిహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ ఆర్గనైజేషన్(CTBTO) ధృవీకరించారు. మరికొందరు సిస్మాలజిస్టులు కూడా ఇరాన్ అణు పరీక్షలు నిర్వహించిందన్న వాదనను తోసిపుచ్చుతున్నారు. కేవలం పది కిలోమీటర్ల లోతులో అణు పరీక్షలు జరపడం అసాధ్యమని తేల్చేశారు.
ఇరాన్ భూకంపాల జోన్లోనే ఉంది. సాధారణంగా ఏడాదిలో అక్కడ 2,100 సార్లు భూమి కంపిస్తుంటుంది. ఇందులో 15 నుంచి 16 సార్లు.. రిక్టర్ స్కేల్పై 5 కంటే ఎక్కువ తీవ్రతతోనే భూమి కంపిస్తుంది. 2006-2015 మధ్య ఇరాన్ 96,000 భూకంపాలను చవిచూసింది.