ఈ విషయంలో చాలా పురోగతి సాధించాం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి
కైరో: ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించి, పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలికేందుకు దోహదపడే కీలక జలమార్గమైన హార్మూజ్ను తిరిగి తెరిచే అంశంపై ఇరాన్, ఒమన్లు ఒక ఒప్పందానికి చాలా సమీపంలోకి వచ్చాయి. ఒకట్రెండు రోజుల్లో దీనికి సంబంధించిన ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కాలిఫోర్నియాలో స్థానిక కాలమానం ప్రకారం ట్రంప్ మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.
‘‘హార్మూజ్ జలసంధిని రేపో లేదా ఎల్లుండో తెరిచేందుకు ఆస్కారం ఉంది. ఈ విషయంలో ఇప్పటికే చాలా పురోగతి సాధించాం’’అని చెప్పారు. హార్మూజ్ను తెరిచే విషయంలో సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బుధవారం బ్యారెల్కు సుమారు 80 డాలర్ల వద్ద ఉంది. ఇది సంఘర్షణ ఉధృతంగా ఉన్నప్పటి స్థాయి కంటే చాలా తక్కువ. ఇరాన్, ఒమన్ మధ్య చర్చల ఫలితంగా కుదిరే అవకాశం ఉన్న ఒప్పందం ప్రకారం... నౌకలు ఇరాన్ నియంత్రణలో ఉన్న మార్గం ద్వారా పర్షియన్ గల్ఫ్లోకి ప్రవేశించి, ఒమన్ నియంత్రణలో ఉన్న మార్గం ద్వారా నిష్క్రమిస్తాయి.
నౌకలకు భద్రత కల్పించినందుకు, సముద్ర పర్యావరణాన్ని పరిరక్షించినందుకు ఇరాన్, యెమెన్లు సేవా రుసుములు వసూలు చేస్తాయి. మరోవైపు హార్మూజ్ జలసంధికి సంబంధించి ఒక ఒప్పందం త్వరలోనే కుదిరే అవకాశం ఉందన్న ఆశలు పెరుగుతున్నప్పటికీ ఆ ప్రాంతంలో నౌకలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం ఎర్ర సముద్రంలో వాఫా అనే సౌదీ చమురు ట్యాంకర్పై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్ అండదండలున్న హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు.
సౌదీ ఓడరేవు పట్టణమైన యాన్బు సమీపంలో ఆ నౌకను లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పారు. అయితే, అందుకు ఎలాంటి సాక్ష్యాధారాలు చూపలేదు. దీనిపై సౌదీ అరేబియా కూడా స్పందించలేదు. మంగళవారం యెమెన్ తీరంలోని ఎర్ర సముద్రంలో పేలుడు పదార్థాలతో నిండిన పడవ ఢీకొనడంతో భారత జెండా ఉన్న వాణిజ్య నౌక మునిగిపోయిందని యెమెన్, భారత అధికారులు తెలిపారు. ఆ నౌకలోని సిబ్బందిని యెమెన్ తీరరక్షక దళం రక్షించింది. వీరిలో 13 మంది భారతీయులు, ఒక యెమెన్ దేశస్థుడు ఉన్నారు.


