అది కుట్ర ప్రకారం జరిగింది.. షేక్‌ హసీనా | Sheikh Hasina speaks to the media for the first time | Sakshi
Sakshi News home page

అది కుట్ర ప్రకారం జరిగింది.. షేక్‌ హసీనా

Aug 5 2026 6:59 PM | Updated on Aug 5 2026 7:30 PM

 Sheikh Hasina speaks to the media for the first time

బంగ్లాలో జరిగింది శాంతియుత విద్యార్థి ఉద్యమం కాదని ఆ విషయంలో విద్యార్థులతో చర్చలు జరపాలనుకుంటున్నామని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తెలిపారు. నిరసనల పేరుతో ఉగ్రవాదులు క్రిమినల్స్‌ రిలీజ్‌ అయ్యారని ఇదంతా ప్లాన్‌ ప్రకారం చేసిన కుట్రని ఆరోపిస్తూ వాయిస్ మెసేజ్ రిలీజ్ చేశారు. ఇది తాము నిర్మించిన బంగ్లాదేశ్‌ కాదని తాను మళ్లీ బంగ్లాదేశ్‌కు వెళతానని తన దేశాన్ని పునర్నిర్మిస్తానని పేర్కొన్నారు. 

కాగా గత కొద్ది సంవత్సరాలుగా  దేశం విడిచి భారత్‌లో ఉంటున్న ఆమె.. ఈ రోజు (బుధవారం)  ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రసంగించనున్నట్లు ప్రకటించారు. ఈ  నేపథ్యంలో బంగ్లాదేశ్‌ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. హసీనా ప్రసంగాన్ని ప్రసారం చేయడం, ప్రచురించడం చట్టవిరుద్ధమని దేశీయ మీడియాను హెచ్చరించింది.

2024లో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన భారీ ఆందోళనల నేపథ్యంలో షేక్‌ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత ఆమె భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఉంటున్నారు. 2025లో నిరసనల అణచివేతకు సంబంధించి మానవత్వానికి వ్యతిరేక నేరాల కేసులో బంగ్లాదేశ్‌ ట్రిబ్యునల్‌ ఆమెకు మరణశిక్ష విధించింది. అయితే ఈ తీర్పును హసీనా చట్టబద్ధం కాదంటూ కొట్టిపారేశారు.

ఈ నేపథ్యంలో.. తాను స్వదేశం విడిచి రెండేళ్లయిన సందర్భంగా ఢిల్లీలోని ఫారిన్‌ కరస్పాండెంట్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సౌత్‌ ఏషియా నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆమె వీడియో లింక్‌ ద్వారా ప్రసంగించనున్నారు. తన కుమారుడు సజీబ్‌ వాజెద్‌ జాయ్‌తో పాటు ఇతర వక్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. హసీనా ప్రధానంగా ఏ అంశాలపై మాట్లాడతారన్న వివరాలు వెల్లడికాలేదు.

అయితే హసీనా ప్రసంగంపై బంగ్లాదేశ్‌ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మాజీ ప్రధాని ప్రసంగాలు, ఇంటర్వ్యూలు, ఆడియో, వీడియో సందేశాలను ప్రసారం చేయడంపై గతంలో అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్‌ విధించిన నిషేధాన్ని గుర్తుచేసింది. ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని మీడియాను హెచ్చరించింది.

మరోవైపు హసీనా వర్గం మాత్రం ప్రభుత్వ వైఖరిని ఖండించింది. దేశ సరిహద్దులు దాటి కూడా భిన్నాభిప్రాయాలను అణచివేయలేరని వ్యాఖ్యానించింది. హసీనా, ఆమె పార్టీ నేతలు డిసెంబర్‌లో స్వదేశానికి తిరిగి వచ్చి న్యాయపరమైన ప్రక్రియను ఎదుర్కొంటారని గతంలో ప్రకటించారు.

ఈ పరిణామాలపై భారత్‌ స్పందిస్తూ.. ఢిల్లీలో జరగనున్న కార్యక్రమం ఒక ప్రైవేటు మీడియా సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమమని స్పష్టం చేసింది. ఇందులో భారత ప్రభుత్వం ఎలాంటి ప్రమేయం లేదని, అక్కడ వ్యక్తమయ్యే అభిప్రాయాలకు తాము బాధ్యత వహించబోమని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement