దక్షిణ కొరియా చేతిలో భారత్ ఓటమి
డేవిస్కప్ క్వాలిఫయర్
సియోల్: డేవిస్కప్ పురుషుల ప్రపంచ టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో ఫైనల్స్కు చేరాలనుకున్న భారత ఆశలు నెరవేరలేదు. దక్షిణ కొరియాతో క్వాలిఫయర్ రెండో రౌండ్లో భారత జట్టు 1–3 తేడాతో పరాజయం పాలైంది. కొత్త ఫార్మాట్లో నిర్వహిస్తున్న డేవిస్ కప్లో ఫైనల్కు చేరిన తొలి ఆసియా దేశంగా నిలిచే అవకాశాన్ని భారత్ చేజార్చుకుంది. శుక్రవారం తొలి రోజు ఆడిన రెండు సింగిల్స్లోనూ పరాజయం పాలై వెనుకబడిన భారత్ ఆ తర్వాత కోలుకోలేకపోయింది. రెండో రోజు శనివారం పురుషుల డబుల్స్లో విజయం సాధించినా... రివర్స్ సింగిల్స్లో సుమిత్ నగాల్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో భారత జట్టుకు ఓటమి తప్పలేదు.
డబుల్స్ మ్యాచ్లో శ్రీరామ్ బాలాజీ–దక్షిణేశ్వర్ 6–3, 3–6, 6–3తో జిసుంగ్ నామ్–యుసింగ్ పార్క్పై విజయం సాధించారు. తప్పక గెలవాల్సిన రివర్స్ సింగిల్స్ పోరులో భారత నంబర్వన్ సుమిత్ నగాల్ 1–6, 2–6తో సూన్వూ క్వోన్ చేతిలో ఓడాడు. దీంతో కొరియా 3–1తో విజయం సాధించడంతో చివరి సింగిల్స్ మ్యాచ్ నిర్వహించలేదు. ఈ విజయంతో కొరియా జట్టు వరల్డ్ ఫైనల్స్ టోర్నమెంట్కు అర్హత సాధించింది. ఇక భారత జట్టు వచ్చే ఏడాది జరగనున్న క్వాలిఫయర్ రౌండ్–1లో పాల్గొననుంది.


