భారత్ విధించిన నిషేధాన్ని తప్పించుకుని మూడో దేశం ద్వారా భారత్లోకి పాకిస్తానీ ఖర్జూరాల దిగుమతికి చేసిన ప్రయత్నాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అడ్డుకుంది. గుజరాత్లోని కాండ్లా పోర్టులో పాకిస్తాన్ మూలానికి చెందిన 364 మెట్రిక్ టన్నుల డ్రై ఖర్జూరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.3 కోట్లుగా అధికారులు వెల్లడించారు.
నిర్దిష్ట సమాచారంతో రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు కాండ్లా పోర్టులో వచ్చిన 13 కంటైనర్లను తనిఖీ చేశారు. పత్రాల్లో ఈ సరుకును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి వచ్చినవిగా పేర్కొన్నప్పటికీ, దర్యాప్తులో అసలు మూల దేశం పాకిస్తాన్ అని తేలింది. పాకిస్తాన్ నుంచి సరుకును తొలుత దుబాయ్కు తరలించి, అక్కడ మరో కంటైనర్లలోకి మార్చిన అనంతరం భారత్కు ఎగుమతి చేసినట్లు విచారణలో గుర్తించారు.
గుగ్గుల్ రెసిన్ కేసులోనూ ఇదే తరహా మోసం
కాండ్లా ఘటనకు కొద్దిరోజుల ముందే తమిళనాడులోని ట్యుటికోరిన్ పోర్టులోనూ ఇలాంటి వ్యవహారాన్ని డీఆర్ఐ గుర్తించింది. సుమారు 14 మెట్రిక్ టన్నుల పాకిస్తాన్ మూలానికి చెందిన గుగ్గుల్ రెసిన్ దాదాపు రూ.1.4 కోట్ల విలువైన సరుకును అధికారులు అడ్డుకున్నారు. ఈ సరుకును సోమాలియా మూలానికి చెందిన సహజ రెసిన్గా పత్రాల్లో చూపించి, దుబాయ్ మీదుగా భారత్కు తరలించినట్లు దర్యాప్తులో తేలింది. నకిలీ పత్రాలను ఉపయోగించినట్లు గుర్తించిన అధికారులు ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు.
పాకిస్తాన్ వస్తువులపై ఎందుకు నిషేధం?
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మూలానికి చెందిన వస్తువుల దిగుమతులపై కఠిన ఆంక్షలు విధించింది. ప్రత్యక్షంగానే కాకుండా మూడో దేశాల ద్వారా పరోక్షంగా దిగుమతి చేసుకోవడం లేదా రవాణా చేయడం కూడా నిషేధం. దీంతో పాకిస్తాన్ నుంచి సరుకులను దుబాయ్ వంటి మూడో దేశాలకు తరలించి, అక్కడి నుంచి భారతదేశానికి పంపే మార్గాలను అక్రమంగా ఉపయోగించే ప్రయత్నాలపై డీఆర్ఐ నిఘా పెంచింది.
ఇదీ చదవండి: ఉచితంగా 20 వేల విమాన టికెట్లు.. ఫ్రీ ఆఫర్!


