భారత పౌర విమానయాన రంగాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చిన ఇండిగో ఎయిర్లైన్స్ నిన్నటితో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2006 ఆగస్టు 4న ఢిల్లీ నుంచి గౌహతి మీదుగా ఇంఫాల్కి నడిపిన ఒకే ఒక్క విమాన సర్వీస్తో అత్యంత సాధారణంగా ప్రారంభమైన ఈ సంస్థ ప్రయాణం నేడు భారత గగనతలంలో కీలకంగా మారింది. విజయవంతంగా 20 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఇండిగో సాధించిన కొన్ని విజయాల గురించి కంపెనీ చెప్పిన కొన్ని అంశాలు కింద చూద్దాం.
భారత దేశీయ విమానయాన రంగంలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. నేడు దేశీయ విమానయాన సామర్థ్యంలో ఏకంగా 51% పైగా వాటాను కలిగి ఉంది. అంతర్జాతీయ సవాళ్లు, ఆయిల్ ధరల హెచ్చుతగ్గులు, ఇతర కంపెనీల పోటీని తట్టుకుని లాభాల బాటలో పయనించడం ఇండిగో వ్యాపార వ్యూహానికి నిదర్శనం.
ఒక్క విమానంతో మొదలైన ప్రయాణం, నేడు 430కి పైగా ఆధునిక విమానాల నెట్వర్క్గా రూపాంతరం చెందింది.
రోజూ 2,200కి పైగా సర్వీసులను నిర్వహిస్తూ అత్యంత రద్దీగా ఉండే ఎయిర్లైన్గా గుర్తింపు పొందింది.
భారతదేశంలోని 95 ప్రధాన నగరాలను, 40కి పైగా అంతర్జాతీయ గమ్యస్థానాలను అనుసంధానిస్తోంది.
భారత్లోని దాదాపు 90% జనాభాకు 100 కిలోమీటర్ల పరిధిలోనే ఇండిగో విమానాశ్రయ సేవలు అందుబాటులో ఉండేలా తన నెట్వర్క్ను విస్తరించింది.
‘లో కాస్ట్ క్యారియర్’ మోడల్ను అమలు చేస్తూ అందుబాటు ధరల్లో టికెట్లను అందిస్తున్నట్లు కంపెనీ చెప్పింది.
అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్లతో పాటు ఏఐ వర్చువల్ అసిస్టెంట్ (6SKAI) ద్వారా టికెట్ బుకింగ్స్, కస్టమర్ సేవలను వేగవంతం చేసింది. ఇటీవల ‘ఇండిగో స్ట్రెచ్’ వంటి ప్రీమియం తరగతులను కూడా ప్రవేశపెడుతూ విభిన్న కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా రూపాంతరం చెందుతోంది.
ఇటీవల 20,000 ఉచిత టికెట్ల వంటి (ఇండిగోఫ్రీ) ఆఫర్లతో తన 20 ఏళ్ల మైలురాయిని జరుపుకునే స్థాయికి ఇండిగో చేరింది.
ఇదీ చదవండి: మళ్లీ నింగినంటుతున్న బంగారం ధరలు


