పెద్ద నగరాలకే పరిమితమైన కార్పొరేట్ మల్టీప్లెక్స్ అనుభవాన్ని చిన్న పట్టణాల ప్రేక్షకులకు సైతం చేరువ చేసేందుకు దేశంలోనే అతిపెద్ద థియేటర్ నెట్వర్క్ పీవీఆర్ ఐనాక్స్ భారీ ప్రణాళికను ఆవిష్కరించింది. ‘స్మార్ట్ సినిమా’ పేరిట రాబోయే మూడేళ్లలో టైర్-2, టైర్-3, టైర్-4 పట్టణాల్లో ఏకంగా 300 అధునాతన సినిమా స్క్రీన్లను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది.
అందుబాటులో టికెట్ ధరలు
మెట్రో నగరాల్లో ఉండే సాధారణ పీవీఆర్ మల్టీప్లెక్స్లతో పోలిస్తే ఈ స్మార్ట్ సినిమా హాళ్లలో టికెట్ ధరలు 30 నుంచి 35 శాతం వరకు తక్కువగా ఉంటాయి. సగటు టికెట్ ధరను రూ.175 పరిధిలోనే ఉంచాలని కంపెనీ నిర్ణయించింది. కేవలం టికెట్ ధరలే కాకుండా పాప్కార్న్, పానీయాలు వంటి ఆహార పదార్థాల ధరలను కూడా 20-25 శాతం వరకు తగ్గించి సామాన్య ప్రేక్షకులకు వినోదాన్ని సులభంగా అందుబాటులోకి తేనున్నారు.
ఫ్రాంచైజీ నమూనా
సాధారణ మల్టీప్లెక్స్లో ఒక్కో స్క్రీన్ నిర్మాణానికి రూ.3 కోట్లు-రూ.4 కోట్ల వరకు వ్యయమవుతుండగా ‘స్మార్ట్ సినిమా’ నమూనాలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తూనే నిర్మాణ వ్యయాన్ని రూ.1.9 కోట్లకు తగ్గించారు. ఇవి ‘ఫ్రాంచైజీ ఓనర్డ్ – కంపెనీ ఆపరేటెడ్’ పద్ధతిలో పనిచేస్తాయి. బిహార్లోని ముజఫర్పూర్లో మొదటి స్మార్ట్ సినిమాను ప్రారంభిస్తుండగా ఆ తర్వాత బారక్పూర్, రాంపూర్, హనుమాన్గఢ్ వంటి అనేక పట్టణాలకు దీన్ని విస్తరించనున్నారు.
సినిమా ప్రదర్శన రంగంలో కొత్త విప్లవం
చిన్న నగరాల్లో పెరుగుతున్న ఆర్థిక స్థోమత, మెరుగైన థియేటర్ అనుభవం పట్ల ప్రజల్లో ఉన్న ఆకాంక్షను దృష్టిలో ఉంచుకుని ఈ అడుగు వేసినట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ బిజిలీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ బిజిలీ తెలిపారు. స్క్రీన్ పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ సౌండ్ క్వాలిటీ, డిజిటల్ ప్రొజెక్షన్, సీటింగ్ సౌకర్యాల్లో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: మళ్లీ నింగినంటుతున్న బంగారం ధరలు


