ఒకప్పుడు భారతీయ బాక్సాఫీస్లో హాలీవుడ్ సినిమాలు ప్రధానంగా మెట్రో నగరాలు, మల్టీప్లెక్స్లకే పరిమితమయ్యేవి. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సూపర్ హీరో చిత్రాలు, సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్లు, సర్వైవల్ డ్రామాలు, యాక్షన్ థ్రిల్లర్లు.. ఇలా విభిన్న కథలతో వస్తున్న హాలీవుడ్ సినిమాలను భారతీయ ప్రేక్షకులు భారీగా ఆదరిస్తున్నారు. ఫలితంగా దేశీయ బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ చిత్రాలు కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2026లో ఈ ట్రెండ్ మరింత బలపడింది. 'మైఖేల్', 'అబ్సెషన్', 'ప్రాజెక్ట్ హెయిర్ మేరీ', 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' వంటి చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ను ఊపేస్తున్నాయి.

సత్తా చాటిన ‘స్పైడర్ మ్యాన్’
టామ్ హాలండ్, జెండయా జంటగా వచ్చిన మార్వెల్ సూపర్ హీరో చిత్రం 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ భారత్లో ఆల్టైమ్ హాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. తొలి రోజే దేశవ్యాప్తంగా రూ60.60 కోట్ల నెట్ (రూ72.44 కోట్ల గ్రాస్) వసూలు చేసి, గతంలో 'అవేంజర్స్: ఎండ్ గేమ్' పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. ఇప్పటి వరకు ఈ చిత్రం ఇండియాలో రూ. 310 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా తొలి వారంతంతోనే రూ. 8,572 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, రికార్డు సృష్టించింది. ఇండియాలో ఈ చిత్రానికి ఇప్పటికీ మంచి ఆదరణ ఉంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తోంది.

చిన్న సినిమా.. భారీ వసూళ్లు
తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన సైకాలజికల్ థ్రిల్లర్ 'అబ్సెషన్' ఈ ఏడాది అతిపెద్ద సర్ప్రైజ్గా నిలిచింది. ఈ చిత్రం ఇండియాలో రూ.75–84 కోట్ల మధ్య నెట్ వసూళ్లు సాధించి, రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ను కూడా దాటింది. భారీ బడ్జెట్ హాలీవుడ్ చిత్రాలను వెనక్కి నెట్టి 2026లో భారత్లో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

సైన్స్ ఫిక్షన్కు భారీ ఆదరణ
ర్యాన్ గోస్లింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' భారత ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వచ్చిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.75 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. . కథ, విజువల్ ఎఫెక్ట్స్, భావోద్వేగాలకు మంచి స్పందన రావడంతో ఈ సినిమా ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లు సాధించింది. ముఖ్యంగా నగరాల్లోని ఐమాక్స్ స్క్రీన్లలో ఈ చిత్రానికి భారీ డిమాండ్ కనిపించింది.

'మైఖేల్'తో మరో హిట్
పాప్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'మైఖేల్' ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. భారతదేశంలో కూడా ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. సంగీతాభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ బయోపిక్ను ఆదరించారు. భారత్లో ఈ చిత్రం రూ.66.44 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, రికార్డు సృష్టించింది.
రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు?
ప్రస్తుతం వరుసగా వస్తున్న హాలీవుడ్ చిత్రాల విజయాన్ని చూస్తే భారతీయ ప్రేక్షకుల అభిరుచి మరింత విస్తరించినట్లు స్పష్టమవుతోంది. మంచి కంటెంట్, అద్భుతమైన విజువల్ అనుభవం ఉంటే భాషతో సంబంధం లేకుండా సినిమాను ఆదరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో విడుదలయ్యే హాలీవుడ్ చిత్రాలు కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


