
ఢిల్లీ: ఆపరేషన్ సింధు కొనసాగుతోంది. ఇరాన్ నుంచి మరో 310 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. శనివారం సాయంత్రం 4:30 గంటలకు తరలింపు విమానం ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. ఇప్పటివరకు 827 మందిని భారత్కు తరలించినట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న ఈ క్రమంలో ఇరాన్లో ఉన్న భారతీయులను సురక్షితంగా దేశానికి తిరిగి తీసుకువచ్చేందుకు భారత్ చర్యలు చేపట్టింది.
కాగా, నిన్న (శుక్రవారం) రాత్రి 11.30 గంటలకు ఇరాన్ నుంచి 290 మంది భారతీయులతో కూడిన విమానం ఢిల్లీకి చేరుకుంది. గురువారం.. మొదటి దశలో 110 మంది పౌరులతో తరలింపు విమానం భారత్కు చేరిన విషయం తెలిసిందే. ఓవైపు యుద్ధం కొనసాగుతున్నాసరే ఇరాన్ భారత్కు అనుకూలంగా వ్యవహరించింది. పౌర విమానాల రాకపోకల కోసం గతంలో మూసేసిన గగనతలాన్ని భారత్ కోసం ప్రత్యేకంగా తెరిచింది. దీంతో ఇరాన్ నుంచి భారత్కు విమానాలు చేరుకుంటున్నాయి.
యుద్ధం కారణంగా అక్కడి మష్హాద్ సిటీలో ఎక్కువ సంఖ్యలో భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆపరేషన్ సిందూలో భాగంగా భారతసర్కార్ ఇరాన్లోని కొందరు విద్యార్థులను రోడ్డుమార్గంలో అర్మేనియాకు తరలించి అక్కడి నుంచి విమానమార్గంలో స్వదేశానికి తీసుకొచ్చింది. ఇకపై నేరుగా ఇరాన్ ఎయిర్పోర్ట్ల నుంచే విమానాలు తిరుగు ప్రయాణం కానున్నాయి.