ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధం.. నష్టం ఎవరికి? నెగ్గిందెవరు? | Iran-Israel Conflict 2025, Who Won And Who Lost In This Check More Details Inside | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధం.. నష్టం ఎవరికి? నెగ్గిందెవరు?

Jun 25 2025 10:11 AM | Updated on Jun 25 2025 10:23 AM

Iran Israel Conflict Who Won Who Lost Check Details

ఇజ్రాయెల్‌ - ఇరాన్‌ యుద్ధానికి తాత్కాలికంగానైనా తెరపడింది. క్షిపణి మోతలు, సైరన్ల హోరు కాస్త తగ్గింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరికలతో ఇరుపక్షాలూ కాల్పుల విరమణకు అంగీకరించాయి. కానీ పరిస్థితి ఇప్పటికీ నివురుగప్పిన నిప్పు చందంగానే ఉందన్నది నిపుణుల అంచనా. అయితే... పదమూడు రోజులపాటు సాగిన ఈ యుద్ధంలో నెగ్గిందెవరు? తగ్గిందెవరు? కష్టమెవరికి? నష్టమెవరికి?.. 

ఇరాన్‌ అణుకార్యక్రమాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా జూన్‌ 13వ తేదీన ఇజ్రాయెల్‌ ‘ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌’ పేరుతో ఇరాన్‌పై దాడులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. కేవలం అయిదంటే అయిదు రోజుల్లో ఇజ్రాయెల్‌ ఇరాన్‌లోని వందకుపైగా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని 330 వరకూ క్షిపణులు ప్రయోగించింది. ప్రతిగా ఇరాన్‌ జూన్‌ పదమూడుతో మొదలుపెట్టి వరుసుగా వారం రోజులపాటు ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్‌ క్షిపణి నిరోధక వ్యవస్థ ఐరన్‌ డోమ్‌ కొన్నింటిని నిరోధించగలిగినా... మిగిలినవి ప్రాణ, ఆస్తినష్టానికి కారణమయ్యాయి. అయితే.. 

జూన్‌ ఇరవైన అమెరికా రంగ ప్రవేశంతో యుద్ధం తీరుతెన్నులు మారాయి. అణుస్థావరాలపై దాడులు చేయడం ద్వారా అమెరికా అతిపెద్ద తప్పు చేసిందని, ఈ దాడులు యుద్ధ ప్రకటనేని హూంకరించిన ఇరాన్‌ మధ్యప్రాచ్యంలోని అమెరికన్‌ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది కూడా. అయితే ఆ తరువాత జూన్‌ 22న రోజు గడవకముందే ఇరుపక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు స్వయంగా ప్రకటించడంతో సర్వత్ర ఆశ్చర్యం వ్యక్తమైంది. అయితే ఈ కాల్పుల విరమణ అమెరికా ఒత్తిడితో బలవంతంగా కుదిరిందే కానీ స్వచ్ఛందంగా ప్రకటించింది కాదని దౌత్య, మిలటరీ వర్గాలు అంటున్నాయి. 

ఇరాన్‌ క్షిపణి దాడులతో బెంబేలెత్తిన ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు నెతన్యాహూ జోక్యం చేసుకోవాల్సిందిగా అమెరికాను అభ్యర్థించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ట్రంప్‌ ఈ అభ్యర్థనను మన్నించి ఇరాన్‌ అణుస్థావరాలపై దాడులు చేశారు. ఇలా ట్రంప్‌ నెతన్యాహ్యూ తన మాట వినేలా చేసుకున్నాడని, అందుకే ఇష్టం లేకపోయినా కాల్పుల విరమణకు అంగీకరించాలని విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా.. 

ఇజ్రాయెల్‌ రెచ్చగొట్టనంత వరకూ తాము ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించమని ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెస్కియన్‌ స్పష్టం చేయగా... ఇజ్రాయెల్‌ మిలటరీ చీఫ్‌ ‘యుద్ధం ముగియలేదు’ ప్రకటించడం గమనార్హం. ఇందుకు తగ్గట్టుగానే ఇరాన్‌ మళ్లీ దాడులకు దిగిందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్‌ టెహ్రాన్‌పై క్షిపణులను ప్రయోగించింది. ఒక అణుశాస్త్రవేత్త మృతికి కారణమైంది కూడా. 

ఇదిలా ఉంటే... ఫొర్డో, నటాన్జ్‌, ఇస్‌ఫహాన్‌లలోని అణు స్థావరాలపై ప్రయోగించిన బంకర్‌ బస్టర్‌ బాంబులతో ఇరాన్‌ సమీప భవిష్యత్తులో అణ్వాయుధాలను తయారు చేయలేదని ట్రంప్‌ ప్రకటించగా... జరిగిన నష్టం తక్కువేనని, కొన్ని నెలల్లోపే అణ్వాయుధాలకు కావాల్సినంత శుద్ధ యురేనియంను సిద్ధం చేసుకోగలమని ఇరాన్‌ చెబుతోంది. ఇందులో ఏమాత్రం వాస్తవమున్నా అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్‌ రెండు ఇరాన్‌పై దాడుల పరంపర కొనసాగించే అవకాశాలే ఎక్కువ.

మొత్తమ్మీద చూస్తే ఈ యుద్ధంలో ఇరాన్‌దే పైచేయిగా కనిపిస్తోంది. అణ్వాయుధ కార్యక్రమాల నిలిపివేత, ఇరాన్‌లో ప్రభుత్వ మార్పు అనే రెండు లక్ష్యాలతో యుద్ధం మొదలుపెట్టిన ఇజ్రాయెల్‌ వాటిని సాధించలేకపోయింది. అణు కార్యక్రమం కొనసాగుతుందని, ప్రభుత్వ మార్పు ఉండబోదని స్పష్టం చేయడం ద్వారా ఇరాన్‌ అమెరికాను కూడా తోసిరాజు అనగలిగింది!

:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement