సముద్రంలో చిక్కుకుపోయిన 28 భారత నౌకలు | Amid Middle East Tensions 28 Indian Vessels with 778 Sailors Stuck in Persian Gulf | Sakshi
Sakshi News home page

సముద్రంలో చిక్కుకుపోయిన 28 భారత నౌకలు

Mar 12 2026 1:28 AM | Updated on Mar 12 2026 1:40 AM

Amid Middle East Tensions 28 Indian Vessels with 778 Sailors Stuck in Persian Gulf

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 28 భారతీయ నౌకలు చిక్కుకుపోయాయి. ఈ నౌకల్లో మొత్తం 778 మంది భారతీయ నావికులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నౌకల పరిస్థితి, సిబ్బంది భద్రతపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోంది.

ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి పరిధిలోని పర్షియన్ గల్ఫ్‌లో 24 భారతీయ నౌకలు ఉన్నాయి. వీటిలో 677 మంది భారతీయ నావికులు ఉన్నారు. అదేవిధంగా జలసంధికి తూర్పు వైపున మరో నాలుగు నౌకలు ఉండగా, వాటిలో 101 మంది భారతీయ నావికులు సేవలందిస్తున్నారు.

నౌకల్లో ఉన్న సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ అధికారులు నౌకల నిర్వహణ సంస్థలతో పాటు నావికుల కుటుంబాలతో కూడా నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ తాజా సమాచారాన్ని అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఈ కంట్రోల్ రూమ్ ప్రాంతీయ పరిణామాలను పర్యవేక్షిస్తూ, అవసరమైతే తక్షణ సహాయ చర్యలను సమన్వయం చేయనుంది.

ఫిబ్రవరి 28న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ భారత జెండా కింద నడిచే నౌకలు, భారతీయ నావికులు అదనపు భద్రతా చర్యలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. భద్రతా ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా అనుసరించడంతో పాటు సిబ్బంది వివరాలను క్రమం తప్పకుండా అధికారులకు తెలియజేయాలని సూచించింది.

అలాగే షిప్ మేనేజర్లు, రిక్రూటింగ్ ఏజెన్సీలు భారత రాయబార కార్యాలయాలు, స్థానిక అధికారులతో నిరంతరం సమన్వయం కొనసాగించాలని ఆదేశించింది. అవసరమైతే భారతీయ నావికులకు తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, దేశంలోని ప్రధాన నౌకాశ్రయాల్లో కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతున్నాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించేందుకు అవసరమైన సహాయం అందించాలని అన్ని ప్రధాన పోర్టులకు సూచనలు జారీ చేసినట్లు పేర్కొంది.

ప్రస్తుతం ప్రధాన నౌకాశ్రయాలు నౌకల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రాంతీయ పరిస్థితిని నిజ సమయంలో అంచనా వేస్తున్నాయి. అలాగే నౌకలు, కార్గో పరిస్థితిపై క్రమం తప్పకుండా నివేదికలు సమర్పిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement