గ్యాస్ సిలిండర్లకు ఐఆర్‌సీటీసీ స్వస్తి? | Iran-Israel War Sparks LPG Crisis Indian Railways Kitchens Face Disruption | Sakshi
Sakshi News home page

గ్యాస్ సిలిండర్లకు ఐఆర్‌సీటీసీ స్వస్తి?

Mar 11 2026 1:25 PM | Updated on Mar 11 2026 1:49 PM

Iran-Israel War Sparks LPG Crisis Indian Railways Kitchens Face Disruption

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా భారతీయ రైల్వే వంటశాలలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇరాన్ వేదికగా సాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్త సరఫరా గొలుసును దెబ్బతీయడంతో దేశంలో ఎల్‌పీజీ కొరత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణికులకు ఆహార కొరత రాకుండా ఉండేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) అత్యవసర మార్గదర్శకాలను జారీ చేసింది.

ఐఆర్‌సీటీసీ తాజాగా వెలువరించిన అధికారిక సర్క్యులర్ ప్రకారం, వెస్ట్ జోన్ పరిధిలోని అన్ని స్టాటిక్ క్యాటరింగ్ యూనిట్లు తక్షణమే ప్రత్యామ్నాయ ఇంధన మార్గాల్లోకి మారాలని ఆదేశించింది. ఫుడ్ ప్లాజాలు, రిఫ్రెష్‌మెంట్ రూమ్‌లు, జన్ ఆహార్ కేంద్రాల్లో ఇకపై సాంప్రదాయ ఎల్‌పీజీ సిలిండర్లకు బదులుగా మైక్రోవేవ్ ఓవెన్లు, ఇండక్షన్ స్టవ్‌లు వినియోగించాలని సూచించింది.

అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ‘రెడీ-టు-ఈట్’ ఆహార పదార్థాలను తగినంత పరిమాణంలో నిల్వ ఉంచుకోవాలని ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది. ‘ప్రయాణికుల సౌకర్యమే మా ప్రధమ ప్రాధాన్యత. అంతర్జాతీయ పరిణామాల వల్ల భవిష్యత్తులో ఆహార సరఫరాకు ఆటంకం కలగకూడదనే ఈ ముందస్తు చర్యలు తీసుకున్నాం’ అని ఐఆర్‌సీటీసీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

సంక్షోభానికి కారణాలు

భారతదేశం తన ఎల్‌పీజీ అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల వల్ల తలెత్తిన సవాళ్లు కింది విధంగా ఉన్నాయి.

  • ఇరాన్ యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ రవాణా చేసే నౌకల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.

  • గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడంతో దేశీయంగా వాణిజ్య సిలిండర్ల లభ్యత తగ్గింది.

  • గ్యాస్ సరఫరా నిలిచిపోతే రైల్వే స్టేషన్లలోని అవుట్‌లెట్లు మూతపడే ప్రమాదం ఉందని నిర్వహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముందుచూపుతో..

రైల్వే క్యాటరింగ్ వ్యవస్థను ఆధునీకరించడం ద్వారా ఈ సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకోవాలని ఐఆర్‌సీటీసీ భావిస్తోంది. విద్యుత్ ఆధారిత వంట పద్ధతులు కేవలం గ్యాస్ కొరతను అధిగమించడమే కాకుండా స్టేషన్లలో అగ్ని ప్రమాదాల ముప్పును కూడా తగ్గిస్తాయని కొందరు భావిస్తున్నారు. పరిస్థితిని బట్టి మరిన్ని జోన్లకు ఈ నిబంధనలను వర్తింపజేసే అవకాశం ఉంది. ఎల్‌పీజీ సరఫరా పునరుద్ధరణపై పెట్రోలియం మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతూనే ప్రయాణికులకు నాణ్యమైన భోజనం అందించడంలో రాజీ పడబోమని ఐఆర్‌సీటీసీ భరోసా ఇచ్చింది.

ఇదీ చదవండి: ఐటీ కారిడార్ హాస్టళ్లలో ‘గ్యాస్’ కష్టాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement