అమెరికాలో ముఖేష్‌ అంబానీ లక్షల కోట్ల పెట్టుబడులు | Reliance Industries To Build 300 Billion Dollars Oil Refinery In Texas, Making Historic US Investment, Check More Details | Sakshi
Sakshi News home page

Reliance industries : అమెరికాలో రిలయన్స్‌ లక్షల కోట్ల పెట్టుబడులు

Mar 11 2026 9:53 AM | Updated on Mar 11 2026 10:47 AM

Reliance industries will build a 300 billion dollars oil refinery in texas

వాషింగ్టన్‌: అమెరికా ఇంధన రంగంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. 50 ఏళ్ల తర్వాత తొలిసారి భారత ప్రముఖ డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అమెరికాలో ఆయిల్‌ రిఫైనరీ కేంద్రాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 300 బిలియన్‌ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు 25 లక్షల కోట్ల రూపాయలు) పెట్టుబడి పెట్టేలా ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారిక ప్రకటన చేశారు. రిలయన్స్‌ పెట్టుబడులపై హర్షం వ్యక్తం చేస్తూ తన ట్రూత్‌ సోషల్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో ‘అమెరికా ఎనర్జీ రంగంలో తన ఆధిపత్యాన్ని తిరిగి సొంతం చేసుకోనుంది. 50 సంవత్సరాల తర్వాత తొలిసారి టెక్సాస్‌లోని బ్రౌన్స్‌విల్లే వేదికగా కొత్త ఆయిల్‌ రిఫైనరీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని ప్రకటించడానికి నేను గర్వపడుతున్నాను. ఇది చారిత్రాత్మక 300 బిలియన్‌ డాలర్ల ఒప్పందం. అమెరికా చరిత్రలో అతిపెద్ద పెట్టుబడి. ఇది అమెరికన్‌ కార్మికులు, శక్తి రంగం, దక్షిణ టెక్సాస్‌ ప్రజలకు గొప్ప విజయం. భారత్‌లోని మా భాగస్వాములకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. 

‘భారత్‌లోని మా భాగస్వాములకు, వారి అతిపెద్ద ప్రైవేట్‌ ఎనర్జీ కంపెనీ రిలయన్స్‌కు  ధన్యవాదాలు. మా అమెరికా ఫస్ట్‌ అజెండా. అనుమతులను సులభతరం చేయడం, పన్నులను తగ్గించడం వల్లే బిలియన్ల డాలర్ల పెట్టుబడులు తిరిగి మా దేశానికి వస్తున్నాయి. బ్రౌన్స్‌విల్లే పోర్టులో కొత్త రిఫైనరీ అమెరికా మార్కెట్లకు ఇంధనం అందిస్తుంది, జాతీయ భద్రతను బలోపేతం చేస్తుంది. అమెరికా ఎనర్జీ ఉత్పత్తిని పెంచుతుంది.  అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత శుభ్రమైన రిఫైనరీగా నిలుస్తుంది. ఇది గ్లోబల్‌ ఎగుమతులకు శక్తినిస్తుంది. వేలకొద్దీ ఉద్యోగాలను సృష్టిస్తుంది. అభివృద్ధిని తెస్తుంది.  దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ప్రాంతానికి ఇది గొప్ప వరం. ఇదే అమెరికా ఎనర్జీ ఆధిపత్యం ఎలా ఉంటుందో చూపిస్తోందని పునరుద్ఘాటించారు. 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఎనర్జీ కంపెనీలలో ఒకటి. ఇప్పటికే జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీని నిర్వహిస్తున్న రిలయన్స్‌  ఇప్పుడు అమెరికాలో కూడా తన ముద్ర వేయబోతోంది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా రిలయన్స్‌  అమెరికా ఎనర్జీ రంగంలో కీలక పాత్ర పోషించనుంది. అమెరికాలో పెరుగుతున్న ఎనర్జీ డిమాండ్‌, గ్లోబల్‌ ఆయిల్‌ మార్కెట్‌ మార్పుల నేపథ్యంలో ఈ కొత్త రిఫైనరీ నిర్మాణం చాలా ముఖ్యమైనది. ఇది అమెరికా ఎనర్జీ భద్రతను పెంచడమే కాకుండా, కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టిస్తుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement