దాడులు ఉధృతం | Iran targets Gulf states with missiles and drones | Sakshi
Sakshi News home page

దాడులు ఉధృతం

Mar 11 2026 2:07 AM | Updated on Mar 11 2026 2:07 AM

Iran targets Gulf states with missiles and drones

మంగళవారం లెబనాన్‌ రాజధాని బీరుట్‌ శివార్లలో ఇజ్రాయెల్‌ క్షిపణి దాడి దృశ్యం

అమెరికాపై ఒత్తిడి పెంచడానికి ఇజ్రాయెల్‌తోపాటు 

గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ క్షిపణుల వర్షం

జెరూసలేం, టెల్‌ అవీవ్‌లో పేలుళ్ల మోత  

బహ్రెయిన్‌ రాజధాని మనామాపై దాడిలో ఒకరి మృతి.. 8 మందికి గాయాలు  

లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడిలో ఐదుగురు హెజ్‌బోల్లా మిలిటెంట్లు హతం  

హొర్మూజ్‌లో చమురు రవాణా నౌకలను అడ్డుకుంటున్న ఇరాన్‌  

ఎక్కడికక్కడే నిలిచిపోయిన నౌకలు  

ఇరాన్‌ నాయకత్వం నానాటికీ బలహీనపడుతోందన్న నెతన్యాహు   

ఉత్తుత్తి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్న ఇరాన్‌

దుబాయ్‌: పశ్చి మాసియా యుద్ధం కొత్త మలుపు తిరుగుతోంది. అమెరికాపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా ఇరాన్‌ సైన్యం ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్‌ అరబ్‌ దేశాలపై దాడులు ఉధృతం చేస్తోంది. యుద్ధం మంగళవారం 11వ రోజుకు చేరుకుంది. బహ్రెయిన్‌ రాజధాని మనామాపై ఇరాన్‌ విరుచుకుపడింది. ఓ భవనంపై జరిగిన క్షిపణి దాడిలో ఒక మహిళ(29) మరణించగా, 8 మంది గాయపడ్డారు. ఇరాన్‌ ప్రయోగించిన రెండు డ్రోన్లను ధ్వంసం చేశామని సౌదీ అరేబియా ప్రకటించింది. ఆరు డ్రోన్లు నేలకూల్చి నట్లు కువైట్‌ నేషనల్‌ గార్డు దళం వెల్లడించింది.

యూఏఈలో పారిశ్రామిక నగరమైన రువాస్‌పై ఇరాన్‌ డ్రోన్లు ప్రయోగించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మరోవైపు బాంబులు, సైరన్ల మోతతో ఇజ్రాయెల్‌ దద్దరిల్లింది. జెరూసలేం, టెల్‌ అవీవ్‌లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్‌ ప్రయోగించిన కొన్ని క్షిపణులను ఇజ్రాయెల్‌ గగనతల రక్షణ వ్యవస్థ మధ్యలోనే అడ్డుకుంది. మరికొన్ని క్షిపణులు లక్ష్యాలను తాకినట్లు తెలుస్తోంది. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌పై వైమానిక దాడులు చేశామని ఇజ్రాయెల్‌ వెల్లడించింది. టెహ్రాన్‌లో పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. తమవైపు దూసుకొచ్చిన ఇరాన్‌ మిస్సైళ్లను తుత్తునియలు చేశామని ఖతార్‌ రక్షణ శాఖ తెలియజేసింది.   

హొర్మూజ్‌పై ఇరాన్‌ గురి  
ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్‌లో అమెరికా సైనిక స్థావరాలపై కేవలం మిస్సైళ్లు, డ్రోన్ల దాడులతో సరిపెట్టకుండా హొర్మూజ్‌ జలసంధిపై ఇరాన్‌ ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఇక్కడ చమురు రవాణా నౌకలను అడ్డుకుంటోంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలొస్తున్నాయి. ధరలు పెరిగేకొద్దీ అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరగడం తథ్యమని, ఫలితంగా ఆ రెండు దేశాలు యుద్ధాన్ని ఆపాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతుందని ఇరాన్‌ అంచనా వేస్తోంది. ముడి చమురు బ్యారెల్‌ ధర 90 డాలర్లు దాటేసింది. ఫిబ్రవరి 28 నాటి ధరతో పోలిస్తే ఇది 24 శాతం అధికం. హొర్మూజ్‌లో చమురు రవాణా నౌకలపై ఇప్పటిదాకా జరిగిన దాడుల్లో ఏడుగురు నావికులు మరణించారు. మంగళవారం పర్షియన్‌ గల్ఫ్‌లో యూఏఈ తీరంలో చమురు రవాణా నౌకపై దాడి జరిగినట్లు సమాచారం. 

హెజ్‌బోల్లాపై ఇజ్రాయెల్‌ దాడులు  
ఇరాన్‌ అండదండలతో దాడులకు తెగబడుతున్న హెజ్‌బోల్లా మిలిటెంట్లపై ఇజ్రాయెల్‌ సైన్యం గురిపెట్టింది. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై క్షిపణులు వర్షం కురిపించింది. ఈ ఘటనలో కనీసం ఐదుగురు మిలిటెంట్లు హతం కాగా, నలుగురు గాయపడినట్లు తెలిసింది. ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని దక్షిణ లెబనాన్‌ ప్రజలకు ఇజ్రాయెల్‌ సైన్యం సూచించింది. హెచ్‌బొల్లాపై భీకర దాడులు చేయడానికి ఇజ్రాయెల్‌ సన్నద్ధమైంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్‌లో ఇప్పటివరకు 1,230 మంది మరణించారు. లెబనాన్‌లో 397 మంది, ఇజ్రాయెల్‌లో 11 మంది మృతిచెందారు. అలాగే ఏడుగురు అమెరికా జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.   

మధ్యవర్తిత్వానికి సిద్ధం: రష్యా  
యుద్ధాన్ని ముగించడానికి తమ వంతు సహకారం అందిస్తామని, మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నా మని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ తెలిపారు. ఈ అవకాశం ఉపయోగించుకోవాలని ఇరాన్, ఇజ్రాయెల్‌–అమెరికాలకు సూచించారు.

ఇరాన్‌పై అత్యంత భీకర దాడులు: హెగ్సెత్‌  
ఇరాన్‌పై అత్యంత భీకర దాడులు చేయబోతున్నామని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ తేల్చి చెప్పారు. ఈరోజే ఈ దాడులు జరుగబోతున్నాయని మంగళవారం ప్రకటించారు. ఇరాన్‌పై గరిష్ట సంఖ్యలో ఆయుధాలు ప్రయోగిస్తామన్నారు. ఇరాన్‌ సైన్యం గత 24 గంటల్లో స్వల్పంగానే క్షిపణులు ప్రయోగించిందని తెలిపారు. ఇరాన్‌ ఆయుధ బలం క్షీణిస్తోందని తెలిపారు. 

బెదిరింపులకు భయపడం: ఇరాన్‌
యుద్ధంలో తగ్గేదేలే అంటూ ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మొహమ్మద్‌ బాఘెర్‌ ఎక్స్‌’లో పోస్టుచేశారు. కాల్పుల విరమణ కోసం ఎదురు చూడడం లేదని, శత్రువులకు బుద్ధి చెప్తామని హెచ్చరించారు. బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని ఇరాన్‌ సైనికాధికారి అలీ లరిజానీ ఉద్ఘాటించారు. హొర్మూజ్‌లో చమురు రవాణాను అడ్డుకుంటే 20 రెట్లు బలంగా దెబ్బకొడతామన్న ట్రంప్‌ హెచ్చరికలను కొట్టిపారేశారు. అమెరికా కంటే బలమైన దేశం కూడా ఇరాన్‌ను ఏమీ చేయ లేన్నారు. ‘మిమ్మల్ని మీరు నాశనం చేసుకో కుండా జాగ్రత్తగా ఉండండి’ అంటూ అమెరికాకు సూచించారు.  

ఇరాన్‌ ప్రజలకు సహకరిస్తాం
నియంతృత్వం, రాక్షస పాలన నుంచి బయటపడడానికి ఇరాన్‌ ప్రజలకు సహకరిస్తామని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు అన్నారు. అంతిమంగా రాజకీయ, పాలనాపరమైన మార్పును సాధించుకోవడం వారి చేతుల్లోనే ఉందని చెప్పారు. ఇజ్రాయెల్‌ ప్రయత్నాలతో ఇరాన్‌ నాయకత్వం బలహీనపడుతోందని పేర్కొన్నారు. ఇరాన్‌ సైన్యం వెన్నుముక విరిచేశామని, ఇప్పటికీ తాము క్రియాశీలకంగా ఉన్నా మని వ్యాఖ్యానించారు. ఇరాన్‌లో శాశ్వతమైన మార్పు రావాలన్నదే తమ ఉద్దేశమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement