పార్లమెంట్‌: ఎల్‌పీజీ కొరతపై దద్దరిల్లిన ఉభయ సభలు | Lok Sabha adjourned Oppn protesting over LPG shortage | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌: ఎల్‌పీజీ కొరతపై దద్దరిల్లిన ఉభయ సభలు

Mar 12 2026 11:58 AM | Updated on Mar 12 2026 12:04 PM

Lok Sabha adjourned Oppn protesting over LPG shortage

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నెలకొన్న ఎల్‌పీజీ (వంటగ్యాస్) సిలిండర్ల తీవ్ర కొరత, పెరుగుతున్న ధరలపై గురువారం పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. పెరుగుతున్న సామాన్యుడి కష్టాలపై కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు నిరసన గళం విప్పగా, మరోవైపు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు దారితీసి, తీవ్ర వాగ్వాదాల మధ్య వీగిపోయింది. కేంద్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే దేశంలో ఇంధన సంక్షోభం ముదిరిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు.

‘హోర్ముజ్ జలసంధి దిగ్బంధం వల్ల ఖతార్, అబుదాబి నుంచి రావాల్సిన చమురు, గ్యాస్ దిగుమతులు నిలిచిపోయాయి. ఈ యుద్ధం ముంచుకొస్తుందని తెలిసినా ప్రభుత్వం ఎందుకు అప్రమత్తం కాలేదు?’ అని ఆయన ప్రశ్నించారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు కనిపిస్తున్నాయని, గృహ అవసరాల సిలిండర్ కోసం 25 రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నోట్ల రద్దు, కరోనా సమయాల్లోనూ ప్రభుత్వం ఇలాగే బుకాయించిందని, ఇప్పుడు కూడా అదే బాటలో సాగుతోందని విమర్శించారు.
 

కేవలం గ్యాస్ మాత్రమే కాకుండా, యుద్ధ ప్రభావం వల్ల 60 వేల టన్నుల బాస్మతీ ఎగుమతులు నిలిచిపోయాయని, మందుల తయారీకి వాడే ముడిపదార్థాల ధరలు 30 శాతం పెరగడంతో సామాన్యునికి వైద్యం భారమైందని విపక్షాలు ఆరోపించాయి. వస్త్ర, విమానయాన, ఉక్కు, ఆటోమొబైల్ రంగాలు కుదేలవుతున్నాయని ప్రియాంక గాంధీ వాద్రా పార్లమెంటు వెలుపల మీడియాతో పేర్కొన్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి.
 
ఇదిలావుండగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలని 118 మంది ఎంపీలు ఇచ్చిన నోటీసుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. నాలుగు దశాబ్దాల తర్వాత స్పీకర్‌పై ఇలాంటి తీర్మానం రావడం దురదృష్టకరమన్నారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడుతూ.. "సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఫిర్యాదు చేసేవారు.. సభకు ఎంతసేపు వస్తున్నారో చూసుకోవాలి. జాతీయ సగటు హాజరు 80 శాతం ఉంటే, ఆయన హాజరు 43-51 శాతమే ఉంది’ అని ఎద్దేవా చేశారు.

రైతులకు నష్టం జరుగుతోందన్న కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టిన షా.. 2013 నాటి డబ్ల్యూటీవో ఒప్పందాలే ప్రస్తుత సమస్యలకు మూలమని అన్నారు. సుదీర్ఘ చర్చ అనంతరం, జగదాంబికా పాల్ అధ్యక్షతన జరిగిన ఓటింగ్‌లో స్పీకర్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. అయితే, హోంమంత్రి వాడిన కొన్ని పదాలు అసందర్భంగా ఉన్నాయని విపక్షాలు ఆరోపించగా, సభాపతి వాటిని రికార్డుల నుంచి తొలగించారు. యుద్ధం ముగిసే వరకు ఇంధన భద్రతపై ప్రభుత్వం స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలని విపక్షాలు పట్టుబట్టాయి.

ఇది కూడా చదవండి: మార్చి ప్రత్యేకం: విశ్వం మెచ్చిన వింత పూలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement