ప్రకృతి ఒడిలో వసంత కాల ఆగమనం సరికొత్త శోభను సంతరించుకుంది. గడ్డకట్టే చలికాలానికి వీడ్కోలు పలుకుతూ, వేసవికి స్వాగతం పలికే మార్చి నెల భూలోకానికి రంగుల అద్దినట్లుగా రూపుదిద్దుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈ నెలలోనే వికసించే కొన్ని అరుదైన, అత్యంత సుందరమైన పుష్పాలు అందరినీ మంత్రముగ్ధులను చేస్తున్నాయి. తోటలు, పార్కులు, పచ్చని మైదానాలు ఈ వర్ణరంజిత కుసుమాలతో కొత్త పెళ్లికూతురిలా ముస్తాబయ్యాయి.
ఆకులు రావడానికి ముందే పూలు
వసంతానికి తొలి సంకేతం ఫోర్సిథియా. దక్షిణ కొరియా, చైనా దేశాల్లో ఈ పుష్పాలు విరిసే మొక్కలు విరివిగా కనిపిస్తాయి. వీటి ప్రత్యేకత ఏమిటంటే ఆకులు రాకముందే కొమ్మల నిండా పసుపు పచ్చని పూలు వికసిస్తాయి. దూరం నుంచి చూస్తే చెట్లన్నీ బంగారు వర్ణపు కంచెలా మెరిసిపోతూ పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తాయి. ఆకులు లేని కొమ్మలపై కేవలం పూలు మాత్రమే కనిపించడం ఎంతో అద్భుతంగా ఉంటుంది.
ప్రకృతి నాట్యం
మధ్యధరా ప్రాంతంలో కనిపించే ఈ పూలను 'పాపీ అనెమోన్' అని కూడా పిలుస్తారు. ఎరుపు, ఊదా, నీలం, తెలుపు రంగుల్లో వికసించే ఈ పూలు వసంతకాలపు ప్రారంభంలో పొలాలను ఒక రంగుల లోకంలా మారుస్తాయి. వీటి సున్నితమైన రేకులు, మధ్యలో ఉండే నల్లని భాగం ప్రకృతి ఆరాధకులకు కనువిందు చేస్తాయి. గాలికి ఊగే ఈ పూల రేకులు చూస్తుంటే ప్రకృతి నాట్యం చేస్తున్నట్లు అనిపిస్తుంది.

భువిపై నీలి మేఘాలు
సాధారణంగా మే నెలలో వికసించే జకరండా పూలు, కొన్ని ప్రాంతాల్లో మార్చి నుంచే సందడి చేస్తాయి. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా తదితర నగరాల్లో వీధులన్నీ ఊదా రంగు పూలతో నిండిపోయి, భూమిపై నీలి మేఘాలు పరుచుకున్నాయా అన్న భ్రమను కలిగిస్తాయి. రాలిపడిన పూలతో రహదారులు పర్పుల్ రంగు తివాచీ పరిచినట్లుగా మారిపోయి, పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి.
అడవిలో సిగ్గుపడే పుష్పాలు
వీటిని 'లెంటెన్ రోజ్' అని కూడా పిలుస్తారు. యూరప్లోని అటవీ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. తెలుపు, పింక్, ఆకుపచ్చ తదితర విలక్షణ రంగుల్లో వికసించే ఈ పూలు మార్చి నెలలో తమ పూర్తి సౌందర్యాన్ని సంతరించుకుంటాయి. మంచు వాతావరణాన్ని కూడా తట్టుకుని నిలబడే శక్తి వీటికి ఉండటం విశేషం. ఇవి కొంచెం కిందికి వంగి ఉండటం వల్ల వీటిని ‘సిగ్గుపడే పుష్పాలు’ అని కూడా అంటుంటారు.
జీవవైవిధ్యానికి ప్రతీకగా..
అమెరికా, చైనాల్లో మార్చి నెలలో మగ్నోలియా చెట్లు పూలతో నిండిపోతాయి. పెద్ద పరిమాణంలో ఉండే ఈ పూలు అద్భుతమైన సువాసనను వెదజల్లుతాయి. మరోవైపు జపాన్, కొరియా దేశాల్లో 'గులాబీ'ని పోలి ఉండే కెమిలియా పుష్పాలు పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. రాజసం ఉట్టిపడే ఈ పుష్పాలు కేవలం అందానికే పరిమితం కాకుండా, జీవవైవిధ్యానికి, పర్యావరణ సమతుల్యతకు చిహ్నాలుగా నిలుస్తున్నాయి.
ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర అలవాటు?


