ఖాళీ సిలిండర్ల కామెడీ.. ‘మీమ్స్‌’ మహోత్సవం | Empty cylinders full comedy memes mahotsav | Sakshi
Sakshi News home page

ఖాళీ సిలిండర్ల కామెడీ.. ‘మీమ్స్‌’ మహోత్సవం

Mar 12 2026 1:42 PM | Updated on Mar 12 2026 1:58 PM

Empty cylinders full comedy memes mahotsav

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన  ఆటంకాలు సామాన్యులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సిలిండర్ బుక్ చేశాక రోజుల తరబడి నిరీక్షించాల్సి రావడంతో,  వినియోగదారులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. అయితే ఈ పరిస్థితులను కొందరు తమదైన శైలిలో హాస్యంగా మలుస్తున్నారు. గ్యాస్ కష్టాలపై సోషల్ మీడియా వేదికగా షేర్‌ అవుతున్న ‘మీమ్స్’ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి.

‘ఉత్తుత్తి’ వంటలు.. వివిధ విన్యాసాలు
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఎల్‌పీజీ దిగుమతులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఫలితంగా పలు  ప్రాంతాల్లో సిలిండర్ల కోసం వినియోగదారులు క్యూ కడుతున్నారు. ఇదే తరుణంలో నెటిజన్లు తమ సృజనాత్మకతకు పదును పెడుతున్నారు. ‘ఖాళీ సిలిండర్లు - నిండుగా కామెడీ’ అన్నట్లుగా పరిస్థితి మారింది. స్టవ్ మీద వంట చేస్తున్నట్లు నటిస్తూ, ‘ఇది ఊహాజనిత గ్యాస్’ అని పేర్కొనే వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరికొందరు.. మళ్లీ పాతకాలం నాటి కట్టెల పొయ్యిల వైపు మళ్లుతున్నట్లుందని అంటున్నారు.

గ్యాస్ అప్పు ఇస్తారా?
గతంలో ఇరుగుపొరుగు వారి వద్ద చక్కెర, పాలు అప్పుగా తీసుకునేవారమని, ఇప్పుడు  గ్యాస్ అప్పు ఇస్తారా? అని అడిగే రోజులు వచ్చాయంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. సిలిండర్లను బంగారు ఆభరణాల్లాగా దాచుకోవడం, వాటికి సెక్యూరిటీ గార్డులను పెట్టుకోవడం వంటి మీమ్స్ హల్‌చల్ చేస్తున్నాయి. కేవలం గృహ అవసరాలకే కాకుండా, వాణిజ్య రంగంపై కూడా ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధరలు దాదాపు 8 శాతం పెరగడంతో రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వహణ భారంగా మారింది. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్‌ సరఫరా వ్యవస్థ దెబ్బతినవచ్చనే భయంతో చాలామంది ముందస్తుగా సిలిండర్లను నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కృత్రిమ కొరతకు కూడా దారితీస్తోంది.

పరిస్థితిని చక్కదిద్దేందుకు భారత ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇప్పటికే మధ్యప్రాచ్య దేశాలతో చర్చలు జరిపారు. హార్ముజ్ జలసంధి గుండా చమురు ట్యాంకర్ల రాకపోకలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తిని 25 శాతం పెంచాలని రిఫైనరీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. నిల్వలు సరిపడా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెట్రోలియం శాఖ భరోసా ఇస్తున్నప్పటికీ, అంతటా పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది.


ఇది కూడా చదవండి: ఎల్‌పీజీ కష్టాలకు త్వరలో విముక్తి: మంత్రి సురేష్ గోపి

Advertisement
 
Advertisement
Advertisement