న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కలవరపెడుతున్న ఎల్పీజీ (వంటగ్యాస్) కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధప్రతిపాదికన చర్యలు చేపట్టింది. ‘హోర్ముజ్ జలసంధి’ వద్ద నెలకొన్న ఉద్రిక్తతలు, సరఫరా అవరోధాల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలలో గ్యాస్ దిగుమతులను పునరుద్ధరించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు.
గురువారం ఆయన ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. త్వరలోనే గ్యాస్ కొరత సమస్య ఒక కొలిక్కి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ బుధవారం పార్లమెంటులో వివరణ ఇచ్చారని సురేష్ గోపి తెలిపారు. జలసంధి వద్ద నెలకొన్న దౌత్యపరమైన సున్నిత అంశాల దృష్ట్యా, అన్ని వివరాలను బహిర్గతం చేయలేమని, అయితే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వివిధ దేశాధినేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ చర్చల ఫలితంగా కొత్త సరఫరా మార్గాలు తెరుచుకుంటున్నాయని, త్వరలోనే అదనపు నిల్వలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.
ఆస్పత్రులు, శ్మశాన వాటికలు వంటి అత్యవసర సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా గ్యాస్ సరఫరా చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. దేశీయంగా పరిస్థితిని చక్కదిద్దేందుకు శాఖా పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అయితే అంతర్జాతీయంగా సరఫరాలో తలెత్తే సాంకేతిక అంశాలపై మనకు పూర్తి నియంత్రణ ఉండదని ఆయన స్పష్టం చేశారు. కేరళ సహా పలు రాష్ట్రాల్లో హోటళ్లు మూతపడటం, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి కట్టెల పొయ్యిలను ఆశ్రయించాల్సిన పరిస్థితులపై ఆయన విచారం వ్యక్తం చేశారు.
గ్యాస్ ధరల నియంత్రణకు సంబంధించి ఇప్పటికే పటిష్టమైన యంత్రాంగం అమల్లో ఉందని, ప్రభుత్వ రంగ సంస్థలైన పెట్రోలియం కంపెనీలే ధరల నిర్ణయాధికారాన్ని కలిగి ఉన్నాయని మంత్రి తెలిపారు. హోర్ముజ్ జలసంధి మన ఇంధన భద్రతకు అత్యంత కీలకమైనప్పటికీ, కేవలం ఇంధనం కోసం యుద్ధానికి వెళ్లడం సరైన నిర్ణయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలనేది భారత విధానమని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: పార్లమెంట్: ఎల్పీజీ కొరతపై దద్దరిల్లిన ఉభయ సభలు


