భయపడాల్సిన పనిలేదు | PM Modi assures at NDA rally in Tamil Nadu | Sakshi
Sakshi News home page

భయపడాల్సిన పనిలేదు

Mar 12 2026 3:23 AM | Updated on Mar 12 2026 3:23 AM

PM Modi assures at NDA rally in Tamil Nadu

కోవిడ్‌ మాదిరే ఈ ఇంధన సంక్షోభం నుంచి గట్టెక్కుతాం 

తమిళనాడులో ఎన్‌డీఏ ర్యాలీలో ప్రధాని మోదీ భరోసా 

తిరుచిరాపల్లి/కొచ్చి: పశ్చిమాసియా సంక్షోభ ప్రభావంతో కొత్తగా భారత్‌లో వెలుగుచూసిన ఎల్పీజీ కొరతపై జనం భయపడాల్సిన పనిలేదని ప్రధాని మోదీ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఎన్నికలు జరగబోతున్న తమిళనాడులో బుధవారం ఎన్‌డీఏ కూటమి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘‘పశ్చిమాసియా సంక్షోభంపై తమిళనాడు ప్రజలకు ఒక్కటే చెప్పదల్చుకున్నా. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా గొలుసులు దెబ్బతిన్నాయి. 

ఈ సమయంలోనూ భారత్‌ మొదట్నుంచీ అవలంభిస్తున్న విధానాన్నే నేను నమ్ముతా. ఎలాంటి సంక్షోభకాలంలోనైనా భారతీయుల స్వప్రయోజనాలకే మా ప్రభుత్వం సదా కట్టుబడి ఉంటుంది. ప్రస్తుత కష్టకాలంలో మన విధానం మారదు. ఇప్పుడు ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు. పుకార్లకు ఎవరూ ప్రాధాన్యత ఇవ్వొద్దు. ప్రజలను ఒక్కటే కోరుతున్నా. 

కేవలం సరైన, విశ్వసనీయ సమాచారం మాత్రమే అందరితో పంచుకోండి. కోవిడ్‌ మహావిలయకాలంలోనూ భారత్‌ ఎంత పరిణతి చెందిన దేశమో 140 కోట్ల మంది భారతీయులు రుజువుచేశారు. అచ్చం అలాగే ఇప్పుడు ఇంధన సంక్షోభాన్ని మ నం విజయవంతంగా ఎదుర్కొని సమస్య నుంచి గట్టెక్కుతాం’’అని మోదీ వ్యాఖ్యా నించారు. 

గల్ఫ్‌ దేశాలు ఆదుకుంటున్నాయి: పశ్చిమాసియా యుద్ధవాతారణంలో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్న భారతీయులకు ఎన్‌డీఏ ప్రభుత్వంతోపాటు గల్ఫ్‌ దేశాలు అన్ని రకాలుగా ఆదుకుంటున్నాయని మోదీ ప్రకటించారు. బుధవారం కేరళంలోని కొచ్చిలో ఎన్‌డీఏ ర్యాలీలో మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘‘ఇరాక్‌లో చిక్కుకున్న నర్సులను కావొచ్చు, యెమెన్‌లో ఉగ్రవాదుల చెరలో బందీగా ఉన్న ఫాదర్‌ టామ్‌ను కావొచ్చు సంక్షోభంలో ఉన్నప్పుడు భారత్‌ ఏనాడూ తన పౌరులను గాలికి వదిలేయలేదు’ అన్నారు

ఆందోళన అనవసరం
అవసరాలకు తగినంత ఎల్పీజీపై సరఫరా 
ఎప్పట్లా 2.5 రోజుల్లోనే రీఫిల్‌ డెలివరీ: కేంద్రం
న్యూఢిల్లీ: ‘‘దేశంలో అవసరాలకు తగినన్ని ఎల్పీజీ నిల్వలున్నాయి. గృహావసరాల డిమాండ్‌ను పూర్తిస్థాయిలో తీర్చడంలో ఎలాంటి ఇబ్బందీ లేదు’’అని కేంద్రం బుధవారం పేర్కొంది. ఎల్పీజీ సరఫరాపై ఆందోళన అవసరం లేదని పెట్రోలియం, సహజ వాయు శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ స్పష్టం చేశారు. ‘‘ఆందోళనతో రీఫిల్స్‌ అధిక బుకింగ్, డీలర్ల అక్రమ నిల్వల వంటివి తప్పుడు సమాచార వ్యాప్తికి దారి తీస్తున్నాయి. వాస్తవానికి గృహ వినియోగదారులకు రీఫిల్‌ సిలిండర్‌ పశ్చిమాసియా కల్లోలానికి ముందు మాదిరిగానే సగటున 2 నుంచి 2.5 రోజుల్లోనే అందుతోంది’’అని ఆమె మీడియాకు వెల్లడించారు. 

ఎల్పీజీ అక్రమ నిల్వలు, బ్లాక్‌ మార్కెటింగ్‌పై ఉక్కుపాదం మోపాల్సిందిగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించామన్నారు. గృహేతర ఎల్పీజీ సరఫరాలో ఆస్పత్రులు, విద్యా సంస్థల వంటి అత్యవసర రంగాలకు ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. ‘‘భారత్‌ తన ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం దిగుమతి చేసుకుంటోంది. ఇందులో 90 శాతం హార్మూజ్‌ జలసంధి గుండానే వస్తోంది’’అని తెలిపారు. ఎల్‌ఎన్‌జీ నిల్వలతో కూడిన రెండు నౌకలు త్వరలో భారత్‌ చేరుకోనున్నట్టు శర్మ వెల్లడించారు. 

హార్మూజ్‌ గుండా భారత్‌కు చమురు, సహజ వాయువు, ఎల్పీజీ రవాణా రెండు వారాలుగా తీవ్రంగా ప్రభావితం కావడం తెలిసిందే. రష్యా తదితర దేశాల నుంచి చమురు సరఫరా అవుతున్నా ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీ విషయంలో మాత్రం సమస్య నెలకొంది. దాంతో ప్రత్యమ్నాయ మార్గాల ద్వారా ఎల్పీజీ సరఫరాను పెంచుకోవడంపై కేంద్రం దృష్టి సారించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement