భారత్లో ఎరువుల సంక్షోభం రానుందా?
ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య గత 12 రోజులుగా సాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ యుద్ధ తంత్రాన్నే మార్చేశాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతోన్న అసమాన దాడులు భారత్ వంటి వ్యవసాయ ఆధారిత దేశాలకు ప్రమాదంగా మారుతున్నాయి. యుద్ధం నేపథ్యంలో ఇప్పటివరకు చాలామంది చమురు, గ్యాస్ ధరల గురించే చర్చిస్తున్నారు, కానీ నిశ్శబ్దంగా ముంచుకొస్తున్న ‘ఎరువుల సెగ’ భారత ఆహార భద్రతను, 147 కోట్ల మంది జీవనోపాధిని ప్రశ్నార్థకం చేయనుందనే సంగతి విస్మరిస్తున్నారు.
భారత వ్యవసాయానికి కీలకంగా హార్ముజ్ జలసంధి..
భారతదేశం తన చమురు అవసరాల కోసం ఎంతగా గల్ఫ్ దేశాలపై ఆధారపడుతుందో, ఎరువుల కోసం కూడా అంతే స్థాయిలో ఆధారపడి ఉంది. ఇరాన్ వైఖరి కారణంగా హార్ముజ్ జలసంధిపై ఏర్పడిన ప్రతిష్టంభన భారత్కు సవాలుగా మారింది.
లెక్కలివే..
భారత్ దిగుమతి చేసుకునే నత్రజని సంబంధిత ఎరువుల్లో (యూరియా, అమ్మోనియా) 63 శాతం, డీఏపీలో 32 శాతం కేవలం గల్ఫ్ దేశాల (యూఏఈ, ఖతార్, సౌదీ, ఒమన్) నుంచే వస్తాయి. దేశానికి కావాల్సిన పొటాష్ దిగుమతుల్లో 42 శాతం వాటా ఒక్క సౌదీ అరేబియాదే. ఇరాన్ నుంచి నేరుగా కొనుగోళ్లు తక్కువగా ఉన్నప్పటికీ (కేవలం 2.59 మిలియన్ డాలర్లు) ఇతర గల్ఫ్ దేశాల నుంచి వచ్చే నౌకలు హార్ముజ్ జలసంధి గుండానే ప్రయాణించాలి. యుద్ధం వల్ల బీమా ప్రీమియంలు పెరగడం, నౌకల రాకపోకలు నిలిచిపోవడం రైతన్నపై భారాన్ని పెంచుతున్నాయి.
ఆహార భద్రతపై ప్రభావం
భారతదేశంలో ఖరీఫ్, రబీ సీజన్లు వ్యవసాయానికి కీలకం. జూన్/ జులైలో విత్తనాలు వేసే సమయానికి ఎరువుల కొరత ఏర్పడితే అది దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఎరువుల దిగుమతి బిల్లు 18 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.5 లక్షల కోట్లు) రికార్డు స్థాయికి చేరుతుందని అంచనా. ఇందులో యూరియా వాటానే 61 శాతంగా ఉండనుంది.
అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ ప్రభుత్వం రైతులకు ఇచ్చే సబ్సిడీ భారం భారీగా పెరగనుంది.
‘మేక్ ఇన్ ఇండియా’కు సహజ వాయువు సెగ
ఎరువుల ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి సాధించాలని, యూరియా దిగుమతులను నిలిపివేయాలని లక్ష్యంగా పెట్టుకుంది (38 మిలియన్ టన్నుల లక్ష్యం). అయితే, యూరియా తయారీకి ప్రధాన ముడిసరుకు అయిన సహజ వాయువు (నేచురల్ గ్యాస్) సరఫరా ఇప్పుడు భారత్ను ఆందోళనకు గురిచేస్తోంది. గత వారం రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఖతార్, యూఏఈల నుంచి సరఫరా తగ్గడంతో భారత అగ్రశ్రేణి గ్యాస్ దిగుమతిదారు ‘పెట్రోనెట్’ మార్కెటింగ్ కంపెనీలకు 30 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇది దేశీయ ఎరువుల ఉత్పత్తిపై నేరుగా ప్రభావం చూపుతుంది.
ప్రత్యామ్నాయ మార్గాలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత సరఫరా గొలుసులో మార్పులు వచ్చాయి. ఇప్పుడు మిడిల్ఈస్ట్ సంక్షోభం నేపథ్యంలో భారత్ తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి ఉంది. ఎరువుల దిగుమతికి సంబంధించి చైనాపై ఆధారపడటం తగ్గించాలని భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా, చైనాలే ఆచరణాత్మక ప్రత్యామ్నాయాలుగా తోస్తున్నాయి. ఇవి హార్ముజ్ జలసంధితో సంబంధం లేకుండా సరఫరా చేయగలవు. నైజీరియా, ఉజ్బెకిస్తాన్, ఇండోనేషియా వంటి దేశాల నుంచి దిగుమతులు పెంచుకోవాలి (ప్రస్తుతం వీటి వాటా 5% కంటే తక్కువ).
ప్రభుత్వ ధీమా
పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పటికీ కేంద్ర ఎరువుల శాఖ మార్చి 6న ఒక ప్రకటన విడుదల చేస్తూ.. దేశంలో ఎరువుల నిల్వలు మెరుగ్గానే ఉన్నాయని స్పష్టం చేసింది. రైతుల్లో అసంతృప్తి కలగకుండా ప్రభుత్వం ఎంతటి ప్రీమియం చెల్లించైనా ఎరువుల సరఫరాను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముడి చమురు కోసం రష్యా వైపు మొగ్గు చూపినట్లుగానే ఎరువుల భద్రత కోసం భారత్ త్వరలో మరిన్ని కీలక ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లు!


