5 నుంచి 30 శాతం వరకు తగ్గింపు
పలు పొదుపు చర్యలను ప్రకటించిన ప్రభుత్వం
ఇస్లామాబాద్: ఇరాన్–అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం పాకిస్తాన్పై తీవ్రంగా పడింది. దీంతో, షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం వేతనాల్లో కోత సహా పలు పొదుపు చర్యలను ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థల ఉద్యోగుల వేతనాల్లో 5 నుంచి 30 శాతం వరకు కోత విధించాలని నిర్ణయించింది. ప్రభుత్వ వాహనాలకు కేటాయించే ఇంధనంలో 50 శాతం కోత విధించడంతోపాటు, వచ్చే రెండు నెలల్లో 60 శాతం వరకు ప్రభుత్వ వాహనాలను రోడ్లపై తిరగకుండా నిలిపివేయనుంది.
అంతేకాకుండా, కొత్త వాహనాల కొనుగోళ్లను నిలిపివేయడంతోపాటు, ఇతర అన్ని రకాల కొనుగోళ్లపైనా నిషేధం విధించాలని నిర్ణయం తీసుకుంది. వివిధ కార్పొరేషన్లు, సంస్థల బోర్డుల ప్రభుత్వ ప్రతినిధులకు ఇకపై పార్టిసిపేషన్ ఫీజు ఇవ్వరాదని సమావేశంలో నిర్ణయించింది. ఈ నిధులను కూడా ప్రభుత్వ పొదుపులో భాగంగానే పరిగణించనుంది.
వచ్చే రెండు నెలల కాలంలో మంత్రి వర్గ సభ్యులు, సలహాదారులు, ప్రత్యేక సహాయకుల వేతనాల నిలిపివేసి, ఆ మొత్తాన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు మళ్లిస్తారు. ప్రభుత్వ అధికారులు, మంత్రులు, సహాయ మంత్రులు, ప్రత్యేక సలహాదారుల విదేశీ పర్యటనలపై పూర్తి నిషేధం అమలు కానుంది. ఇరాన్ యుద్ధం ప్రభావంతో పాకిస్తాన్లో పెట్రోలియం ధరలు లీటరుకు రూ.55 మేర పెరిగాయి.


