బెంగళూరులో జరిగిన ఒక 'హిట్ అండ్ రన్' (Hit-and-Run) ఘటన సంబంధించి పోలీసుల నిర్లక్ష్యంపై ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోటి సంపాదిస్తున్న తన సోదరి ప్రాణానికి విలువ లేకుండాపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేసిన తీరు నెట్టింట వైరల్గా మారింది.బెంగళూరు పోలీసుల తీరుపై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Overlayy అనే AI స్టార్టప్ వ్యవస్థాపకుడు స్నేహిల్ సలూజా, తన సోదరి , ఆమె స్నేహితురాలికి ఎదురైన భయానక అనుభవాన్ని ట్విటర్ ద్వారా పచుకున్నారు.
అసలేం జరిగిందంటే..
స్నేహిల్ కారులో ఆయన సోదరి, ఆమె స్నేహితురాలు ప్రయాణిస్తున్నారు. బెంగళూరులోని ఒక రెడ్ లైట్ సిగ్నల్ పడినపుడు, స్నేహిల్ సోదరి ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ఒక మినీ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు కానీ, తమకుజరిగిన అన్యాయం, ట్రక్కు యజమానిపట్ల పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. ట్రక్కు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని, ఆ విషయం హైవే పోలీసులకు , ట్రక్కు యజమానికి కూడా తెలుసని, అయినా ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ను అరెస్టు చేయలేదనీ కనీసం FIR (ప్రథమ సమాచార నివేదిక) నమోదు చేయడానికి కూడా పోలీసులు నిరాకరించారని స్నేహిల్ ఆరోపించారు.
ఇదీ చదవండి: 6 వేల మీటర్ల లోతులో జపాన్ ఘనత : ప్రపంచంలోనే తొలిసారి
పోలీసుల నిర్లక్ష్యంపై ఆరోపణలు
ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు కదా, కేసు ఎందుకు? ఇన్సూరెన్స్తో సెటిల్ చేసుకోమని పోలీసులు బాధితులకు సూచించారనేది ఆయన వాదన. మరోవైపు ట్రక్కు యజమానులు పోలీసులకు క్రమం తప్పకుండా లంచాలు ఇస్తుంటారని, అందుకే వారిపై ఎలాంటి చర్యలు ఉండవని ఒక అధికారి బాధితులతో అన్నట్లు స్నేహిల్ పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత తన సోదరి బెంగళూరు రోడ్లపై తిరగాలంటేనే భయపడుతోందని, సామాన్య పౌరులకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలపై నమ్మకం పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు పూర్తిస్థాయి ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ, సాంకేతిక కారణాలు చూపి క్లెయిమ్ను కూడా తిరస్కరించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి : అత్యాశతో బంగారం కొంటున్నారా? ఎంత ముప్పో తెలుసా?
చట్టాన్ని గౌరవించే, పన్ను చెల్లించే నిపుణులను కూడా రక్షించడంలో వ్యవస్థ విఫలమైందని స్నేహిల్ పేర్కొన్నాడు. బాధితుల్లో ఒకరు ప్రధాన డేటా కంపెనీలో పనిచేస్తున్న, ఉన్నత IIT-JEE ర్యాంక్ కలిగిన యువ AI ఇంజనీర్. "ఇది 2025లో బెంగళూరు. ఇది 2025లో భారతదేశం" అని ఆయన రాసుకొచ్చారు. కోటి రూపాయల ఆర్జించి పన్నులు కట్టే వారి పరిస్థితి ఇలా ఉంటే, ఇక సాధారణ పౌరులు వ్యవస్థను ఎలా విశ్వసిస్తారని ప్రశ్నించారు.
A 1 crore earning techie's life has no value in Bengaluru.
And if you're not earning that much? Your life has even less.
My sister and her friend were driving home in my car. They stopped at a red light - the logical thing anyone does. A drunk driver in a mini-truck didn't feel…— Snehil Saluja (@mesnhl) February 2, 2026
నెటిజన్ల స్పందన
అధికంగా పన్నులు కట్టే నిపుణులకు కూడా దేశంలో రక్షణ లేకపోతే ఎలా అని నెటిజన్లు కూడా విమర్శించారు.ఈ సంఘటనను సిగ్గుచేటు అని అభివర్ణించారు.ఇటువంటి పరిస్థితుల వల్లే ప్రతిభావంతులైన యువత విదేశాలకు వెళ్ళిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై బెంగళూరు సిటీ పోలీస్ లేదా ట్రాఫిక్ పోలీస్ విభాగం ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.
ఇదీ చదవండి: నంబర్ ప్లేట్ కోసం రూ. 2.08 కోట్లు : ఎవరో తెలుసా?


