బాధ్యత దులిపేసుకున్న మోదీ  | Rahul Gandhi Speech Row Over India-China Conflict | Sakshi
Sakshi News home page

బాధ్యత దులిపేసుకున్న మోదీ 

Feb 5 2026 4:47 AM | Updated on Feb 5 2026 5:38 AM

Rahul Gandhi Speech Row Over India-China Conflict

చైనాతో ఘర్షణ సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు 

అప్పటి ఆర్మీ చీఫ్‌పైకి నెట్టేశారు  

చైనా ట్యాంకులు మీదకు వస్తున్నా సంబంధం లేదన్నట్లుగా మాట్లాడారు  

నరవణే పుస్తకంలో ఏముందో యువత తెలుసుకోవాలి 

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ వెల్లడి  

న్యూఢిల్లీ: భారత్‌–చైనా మధ్య 2020లో జరిగిన ఘర్షణ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ముఖ్యమైన బాధ్యతను అప్పటి ఆర్మీ చీఫ్‌పైకి నెట్టేసి, చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. దేశ భద్రతకు సంబంధించిన అత్యంత సంక్షోభ సమయంలో మోదీ అలా తప్పించుకోవడం ఏమిటని నిలదీశారు. ప్రజలు ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పారిపోతోందని విమర్శించారు.

 రాహుల్‌ బుధవారం పార్లమెంట్‌ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. మాజీ ఆర్మీ చీఫ్‌ ఎం.ఎం.నరవణే రచించి, ఇంకా అధికారికంగా విడుదల చేయని జ్ఞాపకాల పుస్తకాన్ని ప్రదర్శించారు. అందులోని కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ పుస్తకం నిజంగా ఉందన్న సంగతిని యువత తెలుసుకోవాలని కోరారు. అసలు ఇలాంటి పుస్తకమే లేదని ప్రభుత్వం నమ్మబలుకుతోందని, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ అదేమాట చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తూర్పు లద్ధాఖ్‌లో గల్వాన్‌ ఘర్షణ సమయంలో ఏం జరిగిందో నరవణే సవివరంగా రాశారని తెలిపారు.  

మోదీ వస్తే పుస్తకం అందజేస్తా..  
‘‘చైనా యుద్ధ ట్యాంకులు కైలాస పర్వతం దాకా దూసుకొచ్చాయి.. ఇప్పుడేం చేయాలని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ నరవణే విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తోపాటు రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను అడిగారు. అందుకు వారు సమాధానం చెప్పలేదు. దాంతో రాజ్‌నాథ్‌ సింగ్‌ను మళ్లీ అడిగారు. ఉన్నత స్థాయి వాళ్లను(ప్రధానమంత్రి) అడిగి చెప్తానని రాజ్‌నాథ్‌ బదులిచ్చారు. రాజ్‌నాథ్‌ వెళ్లి ప్రధానమంత్రిని అడిగితే.. మీకు ఏది సముచితం అనిపిస్తే అదే చేయండి అంటూ మోదీ బాధ్యత దులిపేసుకున్నారు. చైనా యుద్ధ ట్యాంకులు మన భూభాగంలోకి ప్రవేశించినా తనకు సంబంధం లేదన్నట్లుగా మాట్లాడారు. 

దాంతో ఈ అంశంలో పూర్తిగా ఒంటరిగా మారిపోయినట్లు భావించానని నరవణే తన పుస్తకంలో రాశారు. ఇదే విషయం నేను పార్లమెంట్‌లో చెప్తానని ప్రభుత్వం భయపడుతోంది. అందుకే నన్ను సభలో మాట్లాడనివ్వడం లేదు. లోక్‌సభకు వచ్చేంత ధైర్యం ప్రధాని మోదీకి ఉందని నేను అనుకోవడం లేదు. ఒకవేళ ఆయన వస్తే ఈ పుస్తకం అందజేస్తా’’ అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. అనంతరం ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. ఈ పుస్తకం ప్రతిపక్ష నేత గానీ, విదేశీ రచయిత గానీ రాయలేదని వెల్లడించారు. మాజీ ఆర్మీ చీఫ్‌ రాశారని పేర్కొన్నారు. అయినా ఇలాంటి పుస్తకం లేనేలేదని అంటున్నారని తప్పుబట్టారు. పార్లమెంట్‌కు వచి్చ, నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం మోదీకి లేదని తేల్చిచెప్పారు.  

ప్రభుత్వం భయపడుతోంది: ప్రియాంక  
చైనాతో ఘర్షణ జరిగినప్పుడు మోదీ ప్రభుత్వ నిర్వాకం ఏమిటో జనరల్‌ నరవణే బయటపెట్టారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా పేర్కొన్నారు. నిజాలు ప్రజలకు తెలుస్తాయని మోదీ సర్కార్‌ భయపడుతోందని, అందుకే లోక్‌సభలో మాట్లాడేందుకు రాహుల్‌ గాంధీకి అనుమతి ఇవ్వడం లేదని బుధవారం విమర్శించారు. బీజేపీ ఎంపీలు కూడా గతంలో పుస్తకాలు, మేగజైన్లు, రిపోర్టులను ప్రస్తావిస్తూ పార్లమెంట్‌లో మాట్లాడారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ కూడా సంజయ్‌బారు పుస్తకం గురించి మాట్లాడారని తెలిపారు. నరవణే పుస్తకంపై రాహుల్‌ మాట్లాడితే తప్పేమిటని ప్రశ్నించారు. అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఎంపీలకు 
ఉందన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement