న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో పరిణామాలు ఒక్కరోజులో మారిపోయాయి. రాష్ట్రపతి పాలన రద్దు కాగా, ఆ వెంటనే నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. దాంతో ఏడాది కాలంగా కొనసాగుతున్న రాజకీయ అనిశి్చతికి తెరపడింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా బీజేపీ సీనియర్ నేత వై.ఖేమ్చంద్ సింగ్తో గవర్నర్ అజయ్భల్లా లోక్భవన్లో బుధవారం ప్రమాణం చేయించారు.
బీజేపీ ఎమ్మెల్యే, కుకీ వర్గానికి చెందిన మహిళా నేత నేమ్చా కిప్జెన్, నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎమ్మెల్యే ఎల్.డిఖో ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ సభ్యుడు గోవింద్దాస్ కాంథౌజమ్, ఎన్పీపీ సభ్యుడు కె.లోకెన్సింగ్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్డీయే ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు హాజరయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కిప్జెన్ అక్కడి నుంచే వర్చువల్గా ప్రమాణ స్వీకారం చేశారు. మణిపూర్ కొత్త ప్రభుత్వ గడువు వచ్చే ఏడాది దాకా ఉంది. ప్రమాణ స్వీకారం కంటే ముందు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వు జారీ చేశారు.


