ఇంఫాల్: మణిపూర్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న మణిపూర్కు కొత్త సీఎంగా బీజేపీ నేత, రాష్ట్ర ఖేమ్చంద్ సింగ్ను నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరగనుంది.
మణిపూర్లో గత ఏడాది నుంచి ముఖ్యమంత్రి పదవి ఖాళీగా ఉంది. మాజీ సీఎం ఎన్. బీరెన్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ అస్థిరత నెలకొంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు బీజేపీ హైకమాండ్ కొత్త నాయకత్వాన్ని ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఈమేరకు బీజేపీ సీనియర్ నేత, మాజీ అసెంబ్లీ స్పీకర్ ఖేమ్చంద్ సింగ్ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. అనుభవం, విశ్వసనీయత ఉండటంతో పాటు, ప్రజలతో అనుబంధం కూడా బలంగా ఉండడంతో సీఎం బాధ్యతల్ని ఖేమ్చంద్ సింగ్కు అప్పగించేందుకు పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. ఖేమ్ చంద్ సింగ్ నియామకంతో గత ఏడాది నుంచి కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి, పరిపాలనా లోటు ఈ నియామకంతో ముగుస్తుందని ఆశిస్తున్నారు.
ముఖ్యమంత్రి పదవి ఖాళీగా ఉండటం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి పనులు, పరిపాలనా నిర్ణయాలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితి ప్రజల్లో అసంతృప్తిని కలిగించింది. ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడం ద్వారా పరిస్థితులు చక్కబడతాయని విశ్లేషకులు చెబుతున్నారు.
బీజేపీ హైకమాండ్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడంలో రాష్ట్ర రాజకీయ సమీకరణాలను, ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఖేమ్చంద్ సింగ్ నాయకత్వంలో పార్టీ రాష్ట్రంలో మరింత బలపడుతుందని, ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


