సర్ పేరుతో భారీ ఎత్తున ఓట్లు తొలగించే కుట్ర
బెంగాల్, తమిళనాడు తరహాలోనే ఏపీలోనూ ఓట్లు తొలగించే యత్నం
మాజీ మంత్రి సాకే శైలజానాథ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమం (ఎస్ఐఆర్) లోపభూయిష్టంగా మారిందని, మై టీడీపీ యాప్ ద్వారా ఓట్ల చోరీకి అధికార పార్టీ మరోసారి ప్రయత్నిస్తోందని, సర్ ప్రక్రియలోకి టీడీపీ వైరస్లా చొరబడిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. ఆయన బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మై టీడీపీ యాప్లో ఎన్నికల కమిషన్ ప్రచురించిన దానికంటే స్పష్టంగా ఓటర్ల వివరాలు ఉన్నాయని అన్నారు.
బీఎల్వో ప్రక్రియ పూర్తయిన తర్వాత వివరాలు ఫొటో తీసుకుని టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపిస్తున్నారని తెలిపారు. భారీ ఎత్తున దళితులు, మైనార్టీలు, పేదల ఓట్లు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈసీ వెంటనే అక్రమాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో టీడీపీ నేతల కన్నుసన్నల్లో సాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను తాము అడ్డుకుని ప్రశ్నిస్తే పొరబాటు జరిగిందని చెప్తున్నారని తెలిపారు. ఇటీవల పశ్చిమ బెంగాల్, తమిళనాడు తరహాలోనే ఏపీలోనూ ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని చెప్పారు.
అనంతపురంలో టీడీపీ ప్రణాళికాబద్ధమైన కుట్ర
అనంతపురం జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో 20కి పైగా బూత్లను పరిశీలించగా.. చంద్రబాబు, ఆయన పార్టీ నేతల ఆదేశాలతో అధికారులు ముసుగులు తీసేసి మరీ ప్రత్యక్షంగా బరి తెగిస్తున్న విషయం వెల్లడైందన్నారు. టీడీపీ యాప్ ప్రభుత్వ అధికారులు పెట్టిన గ్రూప్స్లో వచ్చిందని, దానిని ప్రశ్నిస్తే పొరబాటున పెట్టామని చెప్పి తీసేశారని అన్నారు. బుధవారం శింగనమలలోని ఓ బూత్లో నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పంచాయతీ కార్యదర్శి సీట్లో కూర్చుని ఎస్ఐఆర్ ప్రక్రియలో దూరాడని, తాము అడ్డుకుంటే పొరపాటు అంటున్నారన్నారు.
ఇది పొరబాటు కాదని, టీడీపీ ప్రణాళికాబద్ధమైన కుట్ర అని చెప్పారు. అక్కడికక్కడే ఫొటోలు తీయడం, కులం, మతం రాసుకుని వెళ్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఓటరుకు సంబంధించిన ప్రతి విషయం గోప్యంగా ఉండాలన్న విషయం తెలియదా అని అన్నారు. అధికారుల్ని బెదిరించి, ఎన్యుమరేషన్ ఫారంలు తీసుకుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారన్నారు, ఎస్ఐఆర్ ఫారం నింపి ఇస్తే అది కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్తుందా లేదా టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్తుందా అని జనానికి అనుమానాలు వస్తున్నాయన్నారు. ఎన్నికల సంఘం నుంచి మా ఫిర్యాదుపై తగిన సమాధానం రాకపోతే వైఎస్సార్సీపీ పోరాటాలకు సిద్ధంగా ఉందని చెప్పారు.


