తొణుకుమాల సచివాలయంలో దర్జాగా కూర్చుని ఉన్న అధికార పార్టీ నాయకులు
నెల్లూరు జిల్లా తొణుకుమాలలో ఓటర్లకు టీడీపీ నాయకుల అల్టిమేటం
చిల్లకూరు: ‘మా పార్టీకి ఓటు వేస్తామంటేనే మీ దరఖాస్తు ఆన్లైన్లో నమోదు చేయిస్తాం. లేదంటే మీ ఓటు గల్లంతే..’ అంటూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తొణుకుమాల గ్రామంలో టీడీపీ నాయకులు ఓటర్లను బెదిరిస్తున్నారు. తొణుకుమాల గ్రామంలోని 135వ పోలింగ్ కేంద్రం వద్ద శనివారం బీఎల్వో చంద్రశేఖర్ ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకుని ఆన్లైన్లో నమోదు చేయిస్తున్నారు. బీఎల్వో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో బయటకు వెళ్లగా, గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు వచ్చి తమకు అనుకూలంగా ఉండే వారి ఫారాలను ఆన్లైన్లో నమోదు చేయాలని బీఎల్వోకు సహకారం అందిస్తున్న సచివాలయ ఉద్యోగిపై ఒత్తిడి తెచ్చారు.
అదే సమయంలో ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకువచ్చిన గ్రామస్తులను ఉద్దేశించి ‘టీడీపీకి ఓటు వేస్తామంటేనే మీ ఫారాలు ఆన్లైన్లో నమోదు చేయిస్తాం’ అని బెదిరించారు. వారిని వ్యతిరేకిస్తే ఓటు లేకుండా చేస్తారని భయపడిన కొందరు అంగీకరించడంతో తాము చెప్పినవారికి పూర్తయిన తర్వాత లైనులో ఉన్నవారికి ఆన్లైన్లో నమోదు చేయాలని సచివాలయ ఉద్యోగికి టీడీపీ నాయకులు చెప్పారు. ఈ వ్యవహారాన్ని గమనించిన వైఎస్సార్సీపీ బీఎల్ఏ వచ్చి టీడీపీ నాయకులను అడ్డుకునేందుకు యత్నించగా, అతనిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. అనంతరం బీఎల్ వో వచ్చి పరిస్థితిని గమనించి వెంటనే గూడూరు ఆర్డీవో అరుణకుమారికి ఫోన్లో ఫిర్యాదు చేశారు.


