సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్ )పై ఈ నెల 6 నుంచి 8 వరకు సచివాలయ ఉద్యోగుల సౌకర్యార్థం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నారు. ఈ శిబిరాన్ని 6న ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ప్రారంభిస్తారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తదితరులు పాల్గొననున్నారు.
ఈ ప్రత్యేక క్యాంపులో ఎన్యుమరేషన్ ఫారాలు ఆన్లైన్లో సమర్పించడం, కొత్త ఓటర్లు నమోదు, ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన వారి పేర్లు తొలగింపు, చిరునామా మార్పు తదితర అంశాలపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తారు. ఉద్యోగులు 2002 నాటి ఓటరు జాబితాలోని వివరాలు, తాజా ఫొటో, ప్రస్తుత ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు), ఆధార్ కార్డు, రెసిడెన్షియల్ అడ్రస్ ప్రూఫ్ వివరాలతో హాజరు కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.


