రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ వేగం పుంజుకుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం, ఆదివారం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్తో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ 55 శాతానికి చేరిందని వెల్లడించారు. మొత్తం 4.16 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు 2.28 కోట్ల మంది వివరాలను ఆన్లైన్లో నమోదు చేసినట్లు తెలిపారు. గడిచిన 24 గంటల్లోనే 28,30,263 మంది ఓటర్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసినట్లు వివరించారు. జూలై 2న 37.66 శాతంగా ఉన్న డిజిటలైజేషన్.. మూడు రోజుల్లోనే 54.96 శాతానికి చేరుకుందని ఆయన వివరించారు.
వెనుకబడిన బీఎల్వోలు సస్పెండ్
ప్రస్తుతం డిజిటలైజేషన్లో కృష్ణా జిల్లా 69.26 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఏలూరు(68.41 శాతం), చిత్తూరు(63.71శాతం), శ్రీకాకుళం(63.65 శాతం) ఉన్నాయని వివేక్ యాదవ్ తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాలను ఆన్లైన్లో తక్కువగా నమోదు చేసిన జిల్లాలు, నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం డిజిటలైజేషన్లో 50 శాతం కంటే తక్కువగా ఉన్న అల్లూరి సీతారామరాజు (43.65 శాతం), విశాఖపట్నం(47.80 శాతం), వైఎస్సార్ కడప(49.19 శాతం), అనంతపురం(49.63 శాతం) జిల్లాలతోపాటు ఎనీ్టఆర్(50.09 శాతం), కర్నూలు (50.29 శాతం), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు (50.54 శాతం) జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. ఈ జిల్లాల్లో తక్కువ డిజిటలైజేషన్ జరిగిన ప్రాంతాలను గుర్తించి అక్కడ అదనపు సిబ్బందిని, పరిశీలకులను పంపినట్లు తెలిపారు. మరోవైపు 15శాతం కన్నా తక్కువగా డిజిటలైజేషన్ చేసిన పలువురు బీఎల్వోలను అధికారులు సస్పెండ్ చేశారు.


