తాడేపల్లి : SIR( స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై అందరూ అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. గత రెండు నెలలుగా పార్టీ యంత్రాంగమంతా దీనిపైనే పనిచేస్తోందని, పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్లు పోకుండా కాపాడుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
ఈరోజు(మంగళవారం) వైఎస్సార్సీపీ నేతలతో సజ్జల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. SIR, సోషల్ మీడియా బలోపేతం, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘SIR పై అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇది అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తించాలి. గత రెండు నెలలుగా పార్టీ యంత్రాంగమంతా దీనిపైనే పనిచేస్తోంది. రానున్న రెండు నెలలూ అత్యంత కీలకం. అధికార పార్టీ నేతలు అడ్డదారుల్లో ఓట్ల తొలగింపునకు ప్రయత్నిస్తున్నారు.
అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఇందులో బూత్ లెవల్ ఏజెంట్లదే కీలక పాత్ర. ఎన్యూమరేషన్ ఫారాలు ప్రతి అర్హుడికి అందించి, వాటిని సేకరించి సరైన మ్యాపింగ్ చేయాలి. బీఎల్వోలతో సమన్వయం చేసుకోవాలి. బీఎల్వో ఏదైనా దరఖాస్తును తిరస్కరిస్తే, పరిష్కారం కోసం పైస్థాయికి సమాచారం అందించాలి. సోషల్ మీడియాలో పార్టీ వాణి మరింత బలంగా వినిపించాలి. పార్టీ నెట్వర్క్ను విస్తృతంగా పెంచుకోవడంతో పాటు, ప్రజలకు వాస్తవాలను చేరవేయాలి. టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోవాలి. పార్టీ సభ్యత్వ నమోదు, ఐడీ కార్డుల వెరిఫికేషన్లో జాప్యం లేకుండా చూసుకోవాలి’ అని పేర్కొన్నారు.


