సాక్షి, హైదరాబాద్: నగరంలోని బోరబండ ఏరియాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) జాబితాలో తన పేరు లేదన్న ఆందోళనతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానిక భరత్నగర్లో కలకలం రేపింది.
మృతుడు షేక్ ముజీబుర్ రహ్మాన్ (51) కార్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. SIR జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో తనను జైలుకు పంపిస్తారేమోనని భయపడుతూ.. ‘‘అదే జరిగితే మన ముగ్గురు పిల్లలను ఎవరు చూసుకుంటారు?" అంటూ భార్య వద్ద పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
భార్య ఎంతగా ధైర్యం చెప్పినా.. ఆయన మనస్తాపం తగ్గలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. చివరకు ఇంటి బయట ఉన్న షెడ్డు ఇనుప రాడ్కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నిజంగానే ముజీబుర్ రహ్మాన్ పేరు ఓటర్ సవరణ జాబితాలో లేదా? అసలు ఆ కారణంతోనే ఉరేసుకున్నాడా?.. మరణానికి దారితీసిన పరిస్థితులు, ఆయన ఆందోళనకు గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపగా.. SIR జాబితాపై ప్రజల్లో నెలకొన్న సందేహాలు, ఆందోళనలపై మరోసారి చర్చకు దారితీసింది. ఇలాంటి అనుమానాలను ఎన్నికల సంఘం నివృత్తి చేస్తుందేమో చూడాలి.


