తప్పులతడకగా 2002 ఓటరు జాబితా
న్యాయం కోసం కోర్టుకు వెళతాం
వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి
మైదుకూరు: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)కు ఆధారంగా చెబుతున్న 2002 ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని, దానిలో తనతోపాటు తన కుటుంబ సభ్యుల ఓట్లు లేవని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి చెప్పారు. ‘సర్’ పేరుతో వైఎస్సార్సీపీ అనుకూల ఓట్లను తొలగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆయన ధ్వజమెత్తారు. రఘురామిరెడ్డి మంగళవారం వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను 2002 ఓటర్ల జాబితా ఆధారంగా నిర్వహిస్తున్నప్పుడు దానిని ఆన్లైన్లో ఎందుకు సక్రమంగా ఉంచలేదని ప్రశ్నించారు.
ఇప్పుడు చూపిస్తున్న 2002 ఓటర్ల జాబితాలో మైదుకూరు నియోజకవర్గంలోని చాపాడు మండలంలో ఒక గ్రామానికి చెందిన ఓటర్ల జాబితాలో మరొక గ్రామానికి చెందిన వారి పేర్లు ఉన్నాయని తెలిపారు. తన సొంత గ్రామమైన నక్కలదిన్నె ఓటర్ల జాబితాలో స్థానిక ఓటర్ల పేర్లు లేవని చెప్పారు. తన ఓటుతో సహా తన కుటుంబ సభ్యుల ఓట్లు కూడా లేవని రఘురామిరెడ్డి వివరించారు. చిన్నగురువలూరు గ్రామంలో తన కుమారుడు, కోడలి ఓట్లను తొలగించారని మీడియాకు ఆధారాలు చూపారు. తిప్పిరెడ్డిపల్లె, అన్నవరం, పల్లవోలు గ్రామాల్లోనూ స్థానిక ఓటర్ల పేర్లు లేవని తెలిపారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సోమవారమే ప్రారంభం కాగా, ఇప్పటికే 80 శాతం మ్యాపింగ్ జరిగిందని అధికారులు చెబుతున్నారని రఘురామిరెడ్డి తెలిపారు. ఈ విధంగా తుది ఓటర్ల జాబితా వస్తే, అందులో అసలైన ఓటర్ల పేర్లు లేకపోతే ఏం చేయాలని ప్రశి్నంచారు. మైదుకూరు నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి (ఈఆర్వో)తో మాట్లాడేందుకు ప్రయతి్నస్తున్నా అందుబాటులో లేరని చెప్పారు. 2002 ఓటర్ల జాబితాను సరిదిద్దాలని, లేదంటే న్యాయం కోసం కోర్టుకు వెళతామని స్పష్టంచేశారు.


