ఆ పత్రాలు లేకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఇతర పత్రాలూ రుజువుగా ఇవ్వొచ్చు
రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల ఓటర్లు కాగా, అందులో 37% ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు
వీరందరికీ నోటీసులిచ్చి విచారణకు పిలవనున్న ఈఆర్వోలు
మేడ్చల్, రంగారెడ్డి,హైదరాబాద్ జిల్లాల్లో 43, 46, 58 శాతమే ఓటర్ల మ్యాపింగ్
జూలై 25లోగా ఎన్యూమరేషన్ ఫారం సమర్పించిన ఓటర్లకే ముసాయిదా జాబితాలో చోటు
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్), 2026లో భాగంగా రాష్ట్రంలో నోటీసులు అందుకోనున్న వ్యక్తులు సమర్పించాల్సిన రుజువులకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల జాబితానే పరిమితం కాదు..రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఇతర పత్రాలను సైతం రుజువుగా సమర్పించొచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్రెడ్డి అన్నారు. సర్ కార్యక్రమానికి ముందస్తు సన్నద్ధతలో భాగంగా 2002, 2026 ఓటర్ల జాబితాలను అనుసంధానం (మ్యాపింగ్) చేయగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 89,88,175 మంది ఓటర్ల వివరాల్లో తార్కిక వ్యత్యాసాలు ఉన్నట్టు గుర్తించామన్నారు.
‘సర్’షెడ్యూల్ ప్రకారం వ్యత్యాసాలు కలిగిన ఓటర్లందరికీ జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 మధ్య స్థానిక ఎలక్టరోల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వో) నోటీసులు జారీ చేసి నిర్దేశిత తేదీకి విచారణకు పిలుస్తారన్నారు. సర్ కార్యక్రమ ఏర్పాట్లపై శనివారం తన కార్యాలయంలో సుదర్శన్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏఏ ధ్రువీకరణ పత్రాలను రుజువుగా స్వీకరిస్తారని విలేకరులు ప్రశ్నించగా, ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఈఆర్వోలకు విచక్షణాధికారాలను కల్పించినట్టు వెల్లడించారు.
5 లక్షల డూప్లికేట్ ఓటర్ల తొలగింపు
రాష్ట్రంలో 5 లక్షలకు పైగా డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించినట్టు సీఈఓ సుదర్శన్రెడ్డి తెలిపారు. ఒకే పేరు, ఇతర వివరాలతో వేర్వేరు చోట్లలో ఓటర్లు కలిగి ఉన్నట్టు ప్రత్యేక సాఫ్ట్వేర్తో ఈ ఓటర్లను గుర్తించామన్నారు.
గడువు పొడిగింపు ఉండదు
ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 మధ్య బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికి తిరిగి ప్రతి ఓటరుకు సంబంధించిన పాక్షిక వివరాలతో ముద్రించిన ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తారని సుదర్శన్రెడ్డి అన్నారు. ఒక వేళ ఇంటికి తాళం వేసి ఉన్నా, మూడు నాలుగు పర్యాయాలు ఆ ఇంటికి వెళ్లి ఫారాలను పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తారన్నారు. ఫారాలను పూరించి వచ్చే నెల 24లోగా సమర్పిస్తే 31న ప్రచురించే ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు లభిస్తుందని స్పష్టం చేశారు. గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. గడువులోగా ఎన్యూమరేషన్ ఫారం సమర్పించని వారి పేరు ముసాయిదా జాబితాలో గల్లంతు అవుతుందని, అలాంటి వారు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి మళ్లీ ఫారం–6 సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఎన్యూమరేషన్ ఫారంతో ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి అవసరం లేదన్నారు. 2002 ఓటర్ల జాబితా వివరాలు బీఎల్ఓల వద్ద ఉంటాయని, ఆ వివరాలను సైతం ఎన్యూమరేషన్ ఫారంలో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు.
హైదరాబాద్లో ఆంగ్లంలోనే ఎన్యూమరేషన్
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు భాషలో ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయనున్నామని సీఈఓ సుదర్శన్రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఆంగ్ల భాషలో ముద్రించిన ఫారాలను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. అత్యల్పంగా మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో 43.67 శాతం ఓటర్ల మ్యాపింగ్ జరగ్గా, ఆ తర్వాత హైదరాబాద్ 46.69 శాతం, రంగారెడ్డి జిల్లాలో 58.68 శాతం మ్యాపింగ్ మాత్రమే జరిగిందన్నారు. మిగిలిన జిల్లాల్లో 80 శాతం వరకు మ్యాపింగ్ పూర్తయిందన్నారు. విలేకరుల సమావేశంలో అదనపు సీఈఓ వాసం వెంకటేశ్వర్లు, జాయింట్ సీఈఓ ఎం.సత్యవతి, అదనపు కార్యదర్శి శంకర్, సహాయ కార్యదర్శి ఏఎస్ చారి, డిప్యూటీ కలెక్టర్ బి.చెన్నయ్య పాల్గొన్నారు.


