అమెరికా గడ్డపై యోగా .. డెలావేర్ సంచలన ప్రకటన! | Delaware Declares June 21 as International Yoga Day UN Chief Hails Its Universal Appeal | Sakshi
Sakshi News home page

అమెరికా గడ్డపై యోగా .. డెలావేర్ సంచలన ప్రకటన!

Jun 21 2026 8:38 AM | Updated on Jun 21 2026 11:13 AM

Delaware Declares June 21 as International Yoga Day UN Chief Hails Its Universal Appeal

డెలావేర్: అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 వేళ ప్రపంచ వేదికపై భారతదేశ ప్రాచీన సంస్కృతికి మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని డెలావేర్ రాష్ట్రం జూన్ 21ని అధికారికంగా ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’గా గుర్తిస్తూ సంచలన ప్రకటన చేసింది. అటు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ సైతం యోగా విశ్వవ్యాప్తమైందని ప్రశంసించడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు యోగా ఏ విధంగా బాటలు వేస్తోందో ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

డెలావేర్ అధికారిక ప్రకటన – గవర్నర్ కీలక నిర్ణయం
అమెరికా రాష్ట్రమైన డెలావేర్ గవర్నర్ మాథ్యూ మేయర్ జూన్ 21, 2026ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. భారతదేశంలో  ఉద్భవించిన 5,000 ఏళ్ల నాటి ఈ అద్భుత శైలి, మానసిక క్లారిటీని, శారీరక దృఢత్వాన్ని, భావోద్వేగ సమతుల్యతను పెంపొందిస్తుందని గవర్నర్ కొనియాడారు. ఈ చారిత్రాత్మక నిర్ణయంపై న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ హర్షం వ్యక్తం చేస్తూ, గవర్నర్ మేయర్‌కు, దీనికి సహకరించిన డెలావేర్‌లోని భారతీయ-అమెరికన్ సమాజానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఐరాస అధినేత ప్రశంసలు – విశ్వవ్యాప్తమైన యోగా
మరోవైపు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ యోగా ప్రాముఖ్యతను కొనియాడుతూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రాచీన భారతదేశంలో పుట్టిన యోగా.. నేడు కుల, మత, సంస్కృతులకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది జీవితాల్లో భాగమైందని పేర్కొన్నారు. యోగా అనేది కేవలం వ్యాయామం కాదని, అది మన పట్ల, సమాజం పట్ల, భూగ్రహం పట్ల శ్రద్ధ వహించడాన్ని నేర్పుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ‘నమస్తే’ అంటూ ఆయన పిలుపునిచ్చారు.

మోదీ ప్రతిపాదనతో..
నిజానికి, జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మార్చడంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారు. 2014 సెప్టెంబర్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 69వ సమావేశంలో పీఎం మోదీ ఈ ప్రతిపాదనను తీసుకువచ్చారు. దీనికి ప్రపంచ దేశాల నుంచి  మద్దతు లభించడంతో, అదే ఏడాది డిసెంబర్ 11న ఐక్యరాజ్యసమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుండి ప్రతి ఏటా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా యోగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement