టెక్సస్: మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో డాలస్ లో నెలకొని ఉన్న అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో 350కి పైగా ప్రవాస భారతీయులు పాల్గొని విజయవంతం చేశారు. మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వల మాట్లాడుతూ.. గాంధీ మహాత్ముడు సైతం నిత్యం యోగా, ధ్యానం చేసేవారని, అలాంటి గాంధీవిగ్రహం ముందు ఈ యోగా దినోత్సవం జరుపుకోవడం సంతోషం అని అతిథులకు సాదర స్వాగతం పలికారు. కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా డి.సి మంజునాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు ఇవ్వడంతో ఈ తీర్మానం ఆమోదించబడింది. 2015లో మొదటి యోగా దినోత్సవం నిర్వహించినప్పటి నుంచి, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఈ జూన్ 21న యోగాలో పాల్గొంటున్నారు. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలోనే పతంజలి మహర్షి ఈ యోగ సూత్రాలను భారతదేశం నుంచి ప్రపంచానికి అందించిన ఒక గొప్ప బహుమతి అన్నారు.

మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ .. ‘యోగా అనే పదానికి అర్థం - ఐక్యత. ఇది శరీరం, మనస్సు మరియు ఆత్మ మధ్య ఉన్న అనుసంధానాన్ని సూచిస్తుంది. యోగా సాధన చేయడం వల్ల శరీర సౌలభ్యం, బలం, సరైన భంగిమ, శ్వాస నియంత్రణ మెరుగుపడతాయి. అలాగే, నేటి వేగవంతమైన ప్రపంచంలో సాధారణంగా ఎదురయ్యే మానసిక ఒత్తిడులను, ఆందోళనలను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన శరీరం, ప్రశాంతమైన మనస్సు, జీవితంపై సానుకూల దృక్పథాన్ని పెంపొం దించుకోవడానికి యోగాను మన జీవితంలో ఒక భాగంగా చేసుకుందామని మనం సంకల్పిద్దాం’ అని అన్నారు.

మహాత్మాగాంధీ మెమోరియల్ కో-ఛైర్మన్ మహేంద్ర రావు మాట్లాడుతూ.. గత 12 సంవత్సరాలగా ఈ గాంధీ మెమోరియల్ వద్ద క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఏటా పాల్గొనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోర్డ్ సభ్యులు దీపక్ కల్రా, మురళి వెన్నం, తైయబ్ కుండావాల, కళ కృష్ణమూర్తి, హరీష్ నేహతే, అనంత్ మల్లవరపు, వినోద్ ఉప్పు లతో సహా అనేక సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు


