వైవాహిక వివాదాల్లో చిక్కుకున్న మహిళల ఆర్థిక భద్రతకు భరోసా కల్పిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానాల స్ఫూర్తితో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేస్తూ డిక్రీ(తుది తీర్పు ప్రకటన) ఇచ్చినంత మాత్రాన భార్యకు అందుతున్న తాత్కాలిక భరణం ఆటోమేటిక్గా నిలిచిపోదని స్పష్టం చేసింది. ఒకవేళ ఆ విడాకుల తీర్పును సవాలు చేస్తూ పైకోర్టులో అప్పీల్ పెండింగ్లో ఉంటే సదరు న్యాయపరమైన ప్రక్రియను కేసు కొనసాగింపుగానే పరిగణిస్తారు. కాబట్టి అప్పీల్ తేలే వరకు భర్త భరణం చెల్లించాల్సిందేనని ధర్మాసనం తేల్చిచెప్పింది.
హిందూ వివాహ చట్టం, 1955లోని సెక్షన్ 24 కింద మంజూరయ్యే తాత్కాలిక భరణం ఉద్దేశాన్ని ఈ తీర్పు పునరుద్ఘాటించింది. ఫ్యామిలీ కోర్టు భర్తకు అనుకూలంగా విడాకులు ఇచ్చిన నేపథ్యంలో అప్పీల్ దాఖలు చేసిన ఒక మహిళ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విడాకుల తీర్పు రాగానే భరణం ఆపేయాలన్న భర్త వాదనను న్యాయస్థానం పూర్తిగా తోసిపుచ్చింది. ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చినంత మాత్రాన వివాదం ముగిసిపోయినట్లు కాదని చెప్పింది. అప్పీలేట్ పరిహారాలన్నీ పూర్తయ్యే వరకు ఆ కేసు పెండింగ్లోనే ఉంటుందని పేర్కొంది.
నిర్ణయం వెనుక కారణాలు
న్యాయస్థానం తన తీర్పులో రెండు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించింది. మొదటిది, ఉన్నత చదువులు (ఎంబీఏ వంటి అర్హతలు) ఉండి గతంలో ఉద్యోగ అనుభవం ఉన్నంత మాత్రాన మహిళకు సొంతంగా జీవనోపాధి ఉన్నట్లు భావించలేం. కేవలం సంపాదించగల సామర్థ్యం ఉండటం వేరు, నిజంగా సంపాదిస్తూ ఉండటం వేరు అని ధర్మాసనం స్పష్టం చేసింది. రెండోది, అప్పీల్ పెండింగ్లో ఉన్న సమయంలో భరణం నిలిపివేస్తే ఆర్థికంగా ఆధారపడిన జీవిత భాగస్వామి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని, ఇది సెక్షన్ 24 ప్రధాన ఉద్దేశాన్నే దెబ్బతీస్తుందని చెప్పింది.
సుప్రీంకోర్టు గతంలో జగదీష్ సింగ్ వర్సెస్ మాధురి దేవి కేసులో ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తూ అప్పీల్ అనేది అసలు విచారణకు పొడిగింపు మాత్రమేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో సదరు భర్త జీతం నుంచి ప్రతి నెలా 30 శాతం మొత్తాన్ని నేరుగా భార్య ఖాతాకు బదిలీ చేయాలని కోర్టు ఆదేశించింది.
ఇదీ చదవండి: వాడకుండా ఉన్న క్రెడిట్ కార్డ్ను క్లోజ్ చేస్తున్నారా?


