ఉపేక్షించడం సరికాదు! | Sakshi Editorial On Sonam Wangchuk | Sakshi
Sakshi News home page

ఉపేక్షించడం సరికాదు!

Jul 17 2026 1:15 AM | Updated on Jul 17 2026 1:15 AM

Sakshi Editorial On Sonam Wangchuk

సమస్యలనూ, సంక్షోభాలనూ ఉపేక్షిస్తేనో, నిర్లక్ష్యం చేస్తేనో ముగిసిపోవు. మాయంకావు.  వాటిని పట్టించుకుని, పరిష్కరించటానికి ప్రయత్నించటం ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి ఉండాల్సిన బాధ్యత. కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) గత నెల 6న మొదలుకొని న్యూఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో విద్యారంగ సమస్యలపై ఆందోళన చేస్తోంది. గత 19 రోజులుగా విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్చుక్‌ నిరాహారదీక్ష చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తున్నదనీ, మరో రెండురోజులు దీక్ష కొనసాగితే ఆయన ప్రాణానికి ముప్పువాటిల్లే ప్రమాదం ఉన్నదనీ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా ధర్మాసనం వాంగ్చుక్‌ను ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయిస్తూ, ఆ నివేదికల్నిబట్టి వైద్యపరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని గురువారం కేంద్రానికి సూచించింది. 

ఉద్యమకారులు ఒక్కరోజు నిరసనకు అనుమతి తీసుకుని అక్కడినుంచి కదలక పోవటం ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే అంశమే. అలాగని ఆ నిరసనపై పాలకులు కన్నెర్ర చేయలేదు. ఈ సంయమనాన్ని మెచ్చుకోవాల్సిందే. బహుశా సామాజిక మాధ్యమాల్లో సీజేపీ స్వల్పకాలంలోనే అనూహ్యంగా రెండుకోట్ల మందికిమించి మద్దతును సాధించటం ఇందుకొక కారణం కావొచ్చు. సరిగ్గా ఈ కారణంతోనే సీజేపీ దీర్ఘకాలిక ఆందోళనకు సిద్ధపడింది. అయితే నిరశనలతో వచ్చే సమస్యేమంటే... ఒక స్థాయికెళ్లాక జరగరానిది జరిగితే ఉద్యమం కాస్తా చేయిదాటే ప్రమాదం ఏర్పడుతుంది. ‘జాతీయ మీడియా’ ఈ ఉద్యమానికి ప్రాధాన్యం ఇవ్వనంతమాత్రాన ఇలాంటివి జరగబోవని చెప్పలేం. అందువల్లే ప్రతిష్ఠకు పోకుండా ప్రభుత్వం చర్చకు ఆహ్వానిస్తే పరిష్కారం సంగతి తర్వాత... ముందు తమ స్వరాన్ని విన్నారన్న సంకేతం వెళ్తుంది. 

మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేసినప్పుడు ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదనీ, మారిన పరిస్థితుల్లో ఏ సమస్యనైనా ప్రజాస్వామ్య పరిధిలో శాంతియుతంగా పరిష్కరించుకోవచ్చనీ నక్సలైట్లకు అనేకులు హితవు పలికారు. ఇప్పుడు సీజేపీ ఉద్యమాన్ని ఉపేక్షించటంవల్ల వారిలో ఏ కొందరైనా తమ అభిప్రాయం తప్పన్న భావన కొచ్చే అవకాశం ఉండదా? ఉద్యమాలు వెల్లడించే సమస్యల తీవ్రతను గ్రహించటం పాలకులు చేయాల్సిన పని. ఇటు ఉద్యమకారులు కూడా ప్రభుత్వానికీ, ప్రజలకూ సమస్య తీవ్రతను చాటడం, వాటిని పరిష్కరించమని కోరడం తప్ప అందుకోసం తీవ్ర చర్యలకు పాల్పడటం సరికాదని గుర్తించాల్సివుంది. 

నెలన్నర నుంచి సాగుతున్న ఈ ఉద్యమంలో కొందరికి ఇప్పటికే ఈ అవగాహన ఏర్పడి ఉండొచ్చు. తనను నిరాహారదీక్ష విరమించుకోమంటున్నవారి కోసం వాంగ్చుక్‌ విడుదల చేసిన సందేశంలో ఒకచోట... ‘నేను దీక్ష విరమిస్తే ప్రభుత్వాలకు జవాబుదారీతనం అవసరం లేదన్న అభిప్రాయం కలగదా?’ అని ప్రశ్నించారు. జరిగిందేమిటో, విరమణ ఎందుకవసరమైందో ప్రజలు గ్రహించలేరనుకోవటం సరికాదు.

ఢిల్లీ హైకోర్టు చెప్పినట్టు ఏ పౌరుడి ప్రాణమైనా విలువైనదే. కానీ వాంగ్చుక్‌ లాంటి అంకితభావంగల సామాజిక ఉద్యమకారులూ, భిన్నంగా ఆలోచించి సృజనాత్మక ఆవిష్కరణలు చేయగలిగినవారూ ఈ దేశానికి చాలా అవసరం. లద్దాఖ్‌ వంటి కఠినమైన భౌగోళిక పరిస్థితులున్న ప్రాంతానికి అనువైన  వైవిధ్యభరిత ఆవిష్కరణలు చేసి ఆయన అంతర్జాతీయంగా ప్రశంసలు పొందారు. శీతాకాలంలో నీరు వృథా పోతూ, సాగు కాలంలో నీటి ఎద్దడివుండే ఆ ప్రాంతంలో ఆ సమస్యకు తన మేధస్సుతో శాశ్వత పరిష్కారం చూపారు. 

సౌరశక్తి ఆధారిత మట్టి ఇళ్ల ఆలోచన కూడా ఆయనదే. సరిహద్దుల్లో గడ్డకట్టే చలిలో విధులు నిర్వహించే జవాన్లకోసం రూపొందించిన సౌరశక్తి టెంట్లు అపూర్వం. తన తండ్రి, జమ్మూ–కశ్మీర్‌ మాజీ మంత్రి అయిన సోనమ్‌ వాంగ్యాల్‌ ఒరవడిలో ఆయన ఉద్యమిస్తున్నారు. లద్దాఖ్‌కు రాష్ట్రప్రతిపత్తి, దాన్ని ఆరో షెడ్యూల్‌లో చేర్చి రాజకీయ రక్షణ కల్పించడంవంటి డిమాండ్లతో ఈ మూడేళ్లలో పలుమార్లు ఆయన నిరశనలు చేశారు. శాంతియుతంగా మొదలైన ఈ ఉద్యమం అదే రీతిలో ముగియాలని, పట్టుదలకు పోకుండా చర్చలకు ఉపక్రమించాలని అనేకమంది కోరుకుంటున్నారు. అటు సోనమ్‌ వాంగ్చుక్, ఇటు ప్రభుత్వం వినాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement