ప్రముఖ బాలీవుడ్ జంట తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పేసుకుంది. మరాఠీ నటుడు, దర్శకుడు అదినాత్ కొఠారి, ఆయన భార్య నటి ఊర్మిళ కనేత్కర్ విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అఫీషియల్గా ప్రకటించారు. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని.. స్నేహపూర్వకంగా భాగస్వాములుగా విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ సమయంలో తమ గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని అభిమానులను కోరారు. తమ వివాహ బంధం ముగిసినప్పటికీ తమ కుమార్తె జిజా పట్ల ఇద్దరం బాధ్యత తీసుకుంటామని పేర్కొన్నారు. తనను ఇద్దరం కలిసికట్టుగా పెంచడానికి తాము అంకితభావంతో ఉన్నామని తెలిపారు.
కొఠారే తన ఇన్స్టాలో రాస్తూ.. "మా స్నేహితులకు, మీడియాకు, శ్రేయోభిలాషులకు మా విజ్ఞప్తి. చాలా సార్లు ఆలోచించిన తర్వాత నేను, ఊర్మిళ పరస్పర అంగీకారంతో, స్నేహపూర్వకంగా భాగస్వాములుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఒక జంటగా మా ప్రయాణం ముగిసింది. కానీ మా కుమార్తె జిజా పట్ల మా నిబద్ధత ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆమె మాకు అత్యంత ప్రాధాన్యత. ఆమె ప్రేమ, భద్రత, మద్దతుతో పెరిగేలా చూసేందుకు మేము చాలా సంతోషంగా, అంకితభావంతో కలిసి పెంచుతాము. మా జీవితంలో ఈ కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాం. ఇప్పుడు కూడా మీరు మమ్మల్ని అదే విధంగా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం" అని రాసుకొచ్చారు.
ఈ సమయంలో మీడియా మిత్రులు, ప్రజలు మా గోప్యతను గౌరవిస్తారని మేము ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇక సిని కెరీర్ విషయానికొస్తే కొఠారే నెట్ఫ్లిక్స్ సిరీస్ 'ది రాయల్స్'లో కనిపించారు. ఈ షోలో ఇషాన్ ఖట్టర్, భూమి పెడ్నేకర్, జీనత్ అమన్, విహాన్ సమత్, నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటించారు. రణవీర్ సింగ్ హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా 83లో క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్ పాత్ర పోషించారు. కాగా.. కొఠారే ప్రస్తుతం రణబీర్ కపూర్, సాయి పల్లవి నటిస్తోన్న 'రామాయణంలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో రవీ దూబే, యశ్, సన్నీ డియోల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.


