గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి సినిమా అంటేనే విజువల్ వండర్. ఆయనతో పని చేయడానికి స్టార్ హీరో హీరోయిన్లు సైతం ఏళ్ల తరబడి వేచి చూస్తుంటారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న 'వారణాసి' చిత్రం గురించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఈ తరుణంలో ఈ చిత్రంలో నటిస్తున్న ప్రియాంక సినిమా మేకింగ్, రాజమౌళి వర్కింగ్ స్టైల్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రతి సీన్ను క్షుణ్ణంగా పరిశీలిస్తారు..
తాజాగా ఓ పాడ్ కాస్ట్లో రాజమౌళి పర్ఫెక్షన్ గురించి ప్రియాంక మాట్లాడుతూ..‘ఈ ప్రాజెక్ట్ కోసం నేను గత 14 నెలలుగా నిరంతరాయంగా పని చేస్తున్నాను. రాజమౌళితో పని చేయడం ఒక అద్భుతమైన అనుభవం. ఆయన సెట్స్పై ప్రతి చిన్న సన్నివేశాన్ని ఎంతో క్షుణ్ణంగా, అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తారు. అవుట్పుట్ పర్ఫెక్ట్గా వచ్చేవరకు ఆయన అస్సలు రాజీ పడరు’అని ప్రియాంక పేర్కొన్నారు.
మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్సెస్..
సినిమాలో తన పాత్ర , యాక్షన్ ఎపిసోడ్స్ గురించి చెప్తూ ఫ్యాన్స్లో మరింత హైప్ పెంచారామె. ఈ సినిమాలో తాను గతంలో ఎన్నడూ చేయని విధంగా ఎన్నో అద్భుతమైన స్లో-మోషన్ జంప్స్ చేశానని, అవి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని ధీమా వ్యక్తం చేశారు. యాక్షన్ సీన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయని ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది.
ఇంతకంటే చెప్పలేను!
సినిమా కథ, ఇతర వివరాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని అభిమానులు ఆరాటపడుతున్నప్పటికీ, ప్రస్తుతానికి అంతకంటే ఎక్కువ వివరాలు వెల్లడించలేనని ప్రియాంక నవ్వుతూ దాటవేశారు. ‘ప్రస్తుతానికి నేనింతకంటే ఎక్కువ చెప్పలేను. కానీ సినిమా మాత్రం చాలా గ్రాండ్గా వస్తోంది’ అంటూ వారణాసి అప్డేట్కు ముగింపు పలికారు.
అక్టోబర్లో షూటింగ్ పూర్తి
రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్లో పూర్తి కానుంది. ఇప్పటికే కీలక సన్నివేశాల షూటింగ్ పూర్తి చేసినట్లు రాజమౌళి చెప్పారు. అక్టోబర్లో మొత్తం షూటింగ్ పూర్తి చేసి..వచ్చే ఏడాది జనవరిలో ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట. 2027 ఏప్రిల్ 7 ఈ చిత్రం రిలీజ్ కానుంది.


