హీరో సూర్యతో రాజమౌళి కొత్త సినిమా? | Rajamouli new movie with Suriya | Sakshi
Sakshi News home page

హీరో సూర్యతో రాజమౌళి కొత్త సినిమా?

Jul 15 2026 11:30 PM | Updated on Jul 15 2026 11:45 PM

Rajamouli new movie with Suriya

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు కాంబినేషన్‌లో వస్తున్న వారణాసి చిత్రం తర్వాత జక్కన్న ఏ హీరోతో సినిమా చేయబోతున్నారనే చర్చ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది. గతంలో రాజమౌళి తర్వాత చిత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఉండబోతుందని ప్రచారం జోరుగా జరిగింది. అయితే దీనిపై అల్లు అర్జున్ నుంచి కానీ, రాజమౌళి టీం నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

అయితే తాజాగా రాజమౌళి వారణాసి తర్వాత చిత్రం తమిళ స్టార్ హీరో సూర్య కాంబినేషన్‌లో ఉండబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. సినీ ఇండస్ట్రీలో కూడా సూర్యతో సినిమా చేయడానికి రాజమౌళి సానుకూలంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే.. ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యంత క్రేజీ కాంబినేషన్‌లలో ఇది ఒకటిగా నిలవడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే సూర్య-రాజమౌళి కాంబినేషన్‌పై ఇలాంటి వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. వీరి కాంబినేషన్‌లో సినిమా రానుందంటూ గతంలో కూడా పలు వార్తలు తెగ హల్‌చల్ చేశాయి. 

అప్పట్లో రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రంలో హీరోగా ముందు సూర్య పేరును పరిశీలించినట్లు జోరుగా ప్రచారం కూడా జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. అనంతరం కూడా పలుమార్లు వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపించినప్పటికీ, అవి అధికారికంగా ఎప్పుడూ ప్రకటించలేదు. సూర్యతో మూవీ చేసే అవకాశాన్ని తాను మిస్ అయ్యానని అప్పట్లోనే రాజమౌళి చాలా సార్లు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా సూర్య తన 50వ సినిమా రాజమౌళి దర్శకత్వంలోనే ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో వీరిద్దరి కాంబోలో ఓ భారీ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. దాంతో సూర్య అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌పై రాజమౌళి నుంచి కానీ సూర్య నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 

ఇక సూర్య సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది కరుప్పుతో సూపర్ హిట్ కొట్టిన సూర్య ఫుల్ జోష్ మీదున్నారు. వరుస పెట్టి సినిమాలు తీస్తూ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా విశ్వనాథ్ అండ్ సన్స్ అనే మూవీ ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ సినిమా ఆగస్టులో థియేటర్లలో సందడి చేయనుంది. అనంతరం భారీ చిత్రాలు నిర్మించే హోంబలే ఫిల్మ్స్‌తో జతకట్టారు. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌కు జై భీమ్ డైరెక్టర్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement